పాత రోజులు వస్తున్నాయి, నగరాల్లో ఫుల్ రష్, కరోనా నుంచి తేరుకున్న నగరం
hyderabad city rush after covid 19 lockdown : మళ్ల పాత రోజులు వస్తున్నాయి. కరోనా భయం నుంచి నగర వాసులు తేరుకున్నారు. ఆరు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన జనాలు..రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో వైరస్ అదుపులోకి వచ్చింది. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తుండడంతో వైరస్ తగ్గుముఖం పడుతోంది.
తొలుత 5 వేల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు రెండు వేలకు తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రధానంగా ప్రజల్లో పాతుకపోయిన భయం..పోయి కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్త చర్యలు తీసుకుంటూ రోడ్డెక్కుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో అధికారిక కార్యాలయాలు, ఉద్యాన వనాలు, అటవీ స్థలాలు, ఆర్ట్ గ్యాలరీలు, రెస్టారెంట్లు, బిర్యానీ కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, మార్కెట్లు, నగరానికి చుట్టూ ఉన్న సాగరాలు, కొలనులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. దీంతో నగరంలో ఎక్కడ చూసినా సందడే సందడి నెలకొంటోంది.
ఇప్పటికే మెట్రో, ఆర్టీసీ (పరిమిత) రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటు రైళ్లు, అటు బస్సుల రాకపోకలతో నగరం రద్దీగా మారుతోంది.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పార్కులకు అనుమతించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకొంటోంది.
నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు ఈ నెల 6వ తేదీన తెరుచుకోనుంది.
వనస్థలిపురంలోని హరిణస్థలి పార్కు, చిల్కూరు పరిధిలో గల మృగవని నేషనల్ పార్కు సైతం సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి.
నగరంలో ట్రాఫిక్ పెరుగుతోంది. గంటకు మూడున్నర లక్షల మేరకు వాహనాల రద్దీ కొనసాగుతోంది. త్వరలోనే నాలుగు లక్షలకు ట్రాఫిక్ సమస్య చేరుకోనుందని అంచనా.
గోల్కొండ కోట, చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, మక్కా మసీదు లాంటి చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు సందర్శకులు రోజు రోజుకు పెరుగుతున్నారు.
లాక్డౌన్ సడలింపులతో సందర్శకులను ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు.
నగరంలో ఉన్న ప్రధాన దేవాలయాల్లో ఇప్పుడిప్పుడే రద్దీ నెలకొంటోంది.