ఆక్సిజన్ లెవెల్స్ పేరుతో హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రుల భారీ దోపిడీ, ఇలా మోసం చేస్తారు
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. తమకు కరోనా అటాక్ అయ్యిందేమోనని తెగ వర్రీ అవుతున్నారు. కాస్త జలుబు, జ్వరం చేసినా.. కొంత అలసటగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా హడలిపోతున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి తెరతీశాయి. భయంతో వచ్చిన వారిని మరింత భయపెట్టి భారీగా దోచుకుంటున్నాయి. వారి భయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని లక్షలు దండుకుంటున్నాయి. ఇప్పటికే పలు రకాల మోసాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు తాజాగా మరో దోపిడీకి తెరలేపాయి. అదే ఆక్సిజన్ లెవెల్స్. ఆక్సిజన్ లెవెల్స్ పై ప్రైవేటు ఆసుపత్రులు పచ్చి అబద్దాలు చెబుతున్నాయి. అమాయకుల నుంచి దోచుకుంటున్నాయి. ఆక్సిజన్ పేరుతో అసలు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో తెలిస్తే షాక్ కొట్టక మానదు.
అసలు లోపము ఎక్కడ?
నగరానికి చెందిన ఓ వ్యక్తి జ్వరం, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, అతడి ఆక్సిజన్ లెవల్స్ను తెలుసుకునేందుకు అతడి చేతి నుంచి రక్తం తీసుకున్నారు. పరీక్షించి చూడగా అతని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు 65 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో పరిస్థితి సీరియస్గా ఉందని, ఆసుపత్రిలో చేరాలని అతన్ని భయపెట్టారు. వారు చెప్పింది నిజమే అని హడలిపోయిన అతడు మారు మాట్లాడకుండా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. రూ. లక్షల బిల్లు చెల్లించాడు. కాగా, పల్స్ ఆక్సీమీటర్లో అతని ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగానే కనిపిస్తున్నాయి. అయినా సీరియస్ గా ఉందని ప్రైవేటు ఆసుపత్రి ఎందుకు చెప్పింది? ఎందుకిలా జరిగింది? అసలెక్కడ లోపముంది?
ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండాలి? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లాలి? ఎప్పుడు భయపడాలి?
కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ఊపిరితిత్తులకు సక్రమంగా ఆక్సిజన్ అందుతోందా లేదా అనేది తెలుసుకోవడం అత్యంత కీలకమైన అంశం. దీంతో ఎవరికి వారు పల్స్ ఆక్సీమీటర్లను కొనుక్కొని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకుంటున్నారు. అలా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను బట్టే రోగి పరిస్థితి తీవ్రంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సాధారణంగా 95 కంటే తక్కువగా ఉంటే అలర్ట్ కావాలి. 90లోపు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. 85 నుంచి తక్కువవుతూ 65% వరకు చేరుతుందంటే రోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పరిగణించి ఆక్సిజన్ పెడతారు. 65% వరకు వచ్చిందంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు లెక్క. మరి ఆ వ్యక్తికి 65% వరకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినా ఎలా సాధారణంగా ఉండగలిగాడు? ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేకుండానే కేవలం రిపోర్ట్ ఆధారంగానే అతన్ని బెడ్పై ఎందుకు పడుకోబెట్టారు. అసలేం జరుగుతోంది?
మణికట్టు నుంచి కాకుండా మోచేయి నుంచి శాంపిల్స్ సేకరణ:
సాధారణ రక్త పరీక్షల కోసం మోచేయి భాగం నుంచి రక్త నమూనాలు తీస్తారు. వాటి ద్వారా పూర్తి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. వాస్తవానికి రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ను పరీక్షించాలంటే మణికట్టు దగ్గర ఉండే నాడి నుంచి రక్త నమూనాలను తీయాలి. మోచేయి భాగం నుంచి తీసిన రక్త నమూనాలతో ఆక్సిజన్ లెవల్స్ను పరీక్షిస్తే అత్యంత తక్కువగా 65-70 మధ్య మాత్రమే వస్తాయి. నాడి దగ్గర నుంచి తీసే రక్త నమూనాల ద్వారానే ఆక్సిజన్ స్థాయులు సరిగ్గా తెలుస్తాయి. కానీ చాలా ఆసుపత్రులు బాధితులను భయపెట్టి తమ బెడ్లను నింపుకొని రూ. లక్షలు గుంజేందుకు మోచేయి పైభాగం నుంచి తీసిన రక్త
నమూనాల ద్వారానే ఆక్సిజన్ లెవల్స్ను గుర్తిస్తున్నట్లు బాధితుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్లాస్మా థెరపీ అంటూ మరో మోసం:
కరోనా చికిత్స పేరుతో అనేక ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా ప్రజలను మోసం చేస్తున్నాయి. రోగులు అప్పులపాలై రోడ్డున పడేలా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొందరు రోగులకు ప్లాస్మా అవసరమని, ప్రస్తుతం అది అందుబాటులో లేదని, దాతలు దొరకడం లేదని చెప్పి ఆ పేరుతో రూ. లక్షలు గుంజుతున్నాయి. కొన్నిసార్లు వెంటిలేటర్పై ఉన్న రోగులకు ప్లాస్మా చికిత్స చేస్తున్నట్లు అనేక ఆసుపత్రులపై ఆరోపణలున్నాయి. వాస్తవానికి వెంటిలేటర్పై ఉన్న వారికి ప్లాస్మా థెరపి చేసినా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
కానీ రోగులు, వారి కుటుంబ సభ్యుల భయాన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అలాగే సాధారణ ధరలకు రెమిడిసివిర్ ఇంజెక్షన్లు తెప్పించి వాటిని రోగులకు అత్యవసరం పేరిట బ్లాక్లో కొన్నట్లు చెప్పి డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధిక ధరలున్న మరికొన్ని మందులను కూడా ఇలాగే వాడుతూ ఎక్కువ బిల్లులు వేస్తున్నాయి. ఇక కొందరు రోగులకు నెగెటివ్ వచ్చినా వారికి రిపోర్టులు వెంటనే ఇవ్వకుండా చికిత్స పేరిట అనేక ఆసుపత్రులు మోసం చేస్తున్నాయి.
ఇలా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల భయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రజలను అమాయకులను చేసి తప్పుడు పరీక్షలు, తప్పుడు రిపోర్టులతో లక్షలు దండుకుంటున్నాయి. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా, భయపడకుండా ఆలోచనతో అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని సూచించారు.