మీ బ్యాంకు ఖాతాలో రూ.1500 పడలేదా, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 07:40 AM IST
మీ బ్యాంకు ఖాతాలో రూ.1500 పడలేదా, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

లాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ. 1,500 నగదు సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సాయం కూడా చేసింది. కొన్ని లక్షల మంది ఖాతాల్లోకి ఇప్పటికే ఆ డబ్బు చేరిపోయింది. అయినప్పటికీ, ఇంకా చాలామందికి ఆ డబ్బు జమకాలేదు. ఆహార భద్రత కార్డు లేకపోవడం లేదా బ్యాంకు ఖాతా వివరాలు తెలియకపోవడం లేదా ఏ బ్యాంకు/పోస్టాఫీస్ ఖాతాలో డబ్బులు జయ అయ్యాయో అర్థం కాకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. డబ్బు అందని వారు ఆందోళన పడుతున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికి డబ్బు అందుతుందని భరోసా ఇచ్చారు.

బ్యాంక్ ఖాతాల్లో నగదు పడకుంటే సంప్రదించాలని పలు ఫోన్ నెంబర్లు ప్రకటించారు. ల్యాండ్‌ లైన్‌ 040–23324614, 23324615 నంబర్లను గానీ, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967ను గానీ సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ నెంబర్లకు కాల్ చేస్తే నగదు జమకు సంబంధించి వివరాలు అందిస్తారని అధికారులు వెల్లడించారు. అలాగే తపాలా శాఖ ద్వారా కూడా నగదును పంపిణీ చేస్తున్నామని రేషన్ కార్డును చూపించి నగదు పొందవచ్చని అధికారులు చెప్పారు. ఈ నిర్ణయం బ్యాంకు ఖాతాలు లేని పేద కుటుంబాలకు మేలు కలిగిస్తుందన్నారు.

ఈ నంబర్లకు ఫోన్ చేసి, రేషన్ కార్డు నంబర్ చెబితే, వారు పరిశీలించి, ఎవరి ఖాతాలో, ఏ బ్యాంకులో డబ్బు పడిందో వెల్లడిస్తారు. ఒకవేళ, డబ్బు పడకుంటే, అందుకు గల కారణాలను తెలుపుతారు. ఏ విధమైన బ్యాంకు ఖాతాతో సదరు కుటుంబం ఆధార్ కార్డు వివరాలు అటాచ్ కాకుంటే, పోస్టాఫీసుకు వెళ్లి రేషన్ కార్డును చూపిస్తే, వారు బయోమెట్రిక్ తీసుకుని వెంటనే డబ్బు ఇస్తారు. అయితే, ఇంట్లోని కుటుంబ పెద్దగా కార్డులో గుర్తింపు పొందిన మహిళకు మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

బ్యాంకుల్లో డబ్బు పడని పేదలకు పోస్టాఫీసు ద్వారా రూ. 1,500 ఇచ్చే ప్రక్రియను హైదరాబాద్ లో ఇప్పటికే ప్రారంభించారు. తెలంగాణలో 5.21 లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులకు బ్యాంకు ఖాతాలు లేవని ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 1.62 లక్షల కుటుంబాలు హైదరాబాద్ లో ఉన్నాయి. వీరికి అందించాల్సిన రూ. 78.24 కోట్ల మొత్తాన్ని తపాలా శాఖలో జమ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.