Komatireddy Rajagopal Reddy : బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ను రూ.3వేలకు పెంచుతాం- రాజగోపాల్ రెడ్డి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Komatireddy Rajagopal Reddy : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వృద్ధాప్య, ఆసరా పెన్షన్లు రూ.3వేలు చేస్తామన్నారు. బీజేపీ గెలిస్తే పెన్షన్ రాదని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. బీజేపీని గెలిపిస్తే పెన్షన్ పెంచుతుందే తప్ప, తగ్గించందన్నారు రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు ఉపఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం చండూరులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికను అవసరం లేకపోయినా బలవంతంగా రుద్దిన ఎన్నికగా అభివర్ణించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే తాను మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్దిలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని తెలిపారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై కేటీఆర్ ధ్వజమెత్తారు. గడచిన నాలుగేళ్లలో రాజగోపాల్ రెడ్డి ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ఒక్క సారైనా ఏ ఒక్క మంత్రినైనా కలిశారా? అని నిలదీశారు. పదేళ్ల క్రితం మునుగోడు ఇప్పుడెలా ఉందో చూడండని ఆయన ఓటర్లను కోరారు.
గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5లక్షల పరిహారం ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆరేనన్నారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం నుంచి కాపాడింది కూడా కేసీఆరేనన్నారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం నల్లగొండ జిల్లాకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచిస్తే… రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుని రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆయన విమర్శించారు.