ఫార్మా సిటీ (ఔషధ నగరి)కి భూమి ఇచ్చే వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం

  • Published By: madhu ,Published On : August 24, 2020 / 08:22 AM IST
ఫార్మా సిటీ (ఔషధ నగరి)కి భూమి ఇచ్చే వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూమిని ఇస్తున్న వారిలో కనీసం కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగం ఇచ్చే దిశగా కసరత్తు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.



ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాల జాబితా తయారు చేయాలని, కుటుంబ సభ్యులు, వారి విద్య, ఇతర అర్హతలను మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఫార్మాసిటీలో మౌలిక వసతుల ఏర్పాటు పనులను స్పీడప్ చేయాలన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

స్థానికులకు శిక్షణచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇందుకు ఫార్మా సిటీ పరిసర మండలాల్లో రెండు ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), ఇతర శిక్షణ సంస్థల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలో కలిసి ఈ శిక్షణ కేంద్రాల ద్వారా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు.



ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోందని, రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు, 5.60 లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకు కరోన వ్యాప్తి నేపథ్యంలో ప్రాధాన్యం పెరిగిందన్నారు.

ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.



ఫార్మా కంపెనీలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా ఫార్మా సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం చాలా కాలంగా యోచిస్తోంది. ఈ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫార్మాసిటీ కోసం సేకరిస్తారు.