తెలంగాణ వ్యాప్తంగా 1213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేశాం: కేసీఆర్
Covid vaccination : ‘తెలంగాణ వ్యాప్తంగా జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ను అన్ని పీహెచ్సీల పరిధిలో స్టార్ట్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే చేసేసింది. వెయ్యి 213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. వ్యాక్సిన్ను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లను రెడీ చేశాం. రాష్ట్ర స్థాయిలో సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంకు వాలంటీర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
సోమవారం ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన మీటింగ్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సమీక్షించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ 2 సందర్భాల్లోనూ సీఎం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
‘సీరం రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ను సమర్థవంతమైన వ్యాక్సిన్లుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్లనే రాష్ట్రంలో అందించాలని నిర్ణయించాం. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ స్టాఫ్ సహా మెడికల్, హెల్త్ స్టాఫ్కు అనంతరం కోవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా బలగాలు, పారిశుధ్య సిబ్బంది తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తాం. ప్రాధాన్యత క్రమంలో నిర్ణయించిన వారిని వ్యాక్సినేషన్ సెంటర్కు తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలి’ అని సీఎం వెల్లడించారు.
ఇంకా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు భాగస్వాములు కావాలి అని కోరారు. ‘వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ అందించడానికి వీలుగా వ్యాక్సిన్ సెంటర్కు దగ్గర్లో ఒక గదిని, డాక్టర్ను, అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతాం’అని కేసీఆర్ వివరించారు.