KMM RAMYA : చదువు,సాగు..కుటుంబానికి అన్నీ తానై నిలిచిన చదవుల తల్లి రమ్య

కరోనా దెబ్బకు ఎంతోమంది జీవితాలు తల్లక్రిందులు అయిపోయినట్లే తెలంగాణాలో భద్రాద్రి జిల్లాకు చెందిన రమ్య జీవితాన్ని కూడా కష్టాల్లో పడేసింది.చదువుల్లోను, ఆటల్లోను ఎంతో ప్రతిభ కనబరిని పేదింటి బిడ్డ రమ్య అటు వ్యవసాయం..ఇటు చదువు కొనసాగిస్తున్న క్రమంలో తల్లిదండ్రులిద్దరు కరోనా బారిన పడ్డారు. దీంతో రమ్యకు చదువు, వ్యవసాయంతో పాటు ఇంటికి పెద్దగా మారింది.అందరినీ తానే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

KMM RAMYA : చదువు,సాగు..కుటుంబానికి అన్నీ తానై నిలిచిన చదవుల తల్లి రమ్య

Ramya Story

Khammam Bhadradri BCM Ramya Agriculture : తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రమ్య చదువుల తల్లి. పేదింటి బిడ్డ అయినా చదువుల్లో ఫస్టుగా నిలిచింది. ఎన్నో పతకాలు గెలుచుకుంది. కానీ ఎంతోమంది జీవితాలను కకావికలం చేసిన కరోనా మహమ్మారి రమ్య జీవితాన్ని కూడా తల్లక్రిందులు చేసింది. తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా కోవిడ్ బారినపడడంతో రమ్య జీవితాన్ని ప్రశ్నార్థం చేసింది. అన్నీ తానై నిలిచింది కుటుంబానికి. అమ్మలా కన్నవాళ్లను తోడబుట్టిన సోదరికి సపర్యలు చేసింది. కష్టాలను ఓర్చుకుని తనను చదివిస్తున్న తల్లిదండ్రులకు అండగా నిలిచి వ్యవసాయంలో తోడుగా నిలిచింది. కన్నవారి కష్టానికి చలించిపోయింది. అందుకే నాగలి పట్టింది. సేద్యం చేసింది. కరోనా తర్వాత కుటుంబం కకావికలం కాగా.. ఇప్పుడు ఆ ఇంటికి పెద్దగా నిలుస్తోంది. చదువుకుంటూనే వ్యవసాయం చేస్తోంది. అంతేకాదు గొప్పలక్ష్యంతో ముందుకు సాగుతూ.. ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది.

రమ్యది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రుని పేట సొంతూరు. హైదరాబాద్‌ ఏవీ కాలేజీలో పీఈటీ కోర్సు చదువుతోంది. స్కూల్‌ చదివేప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండేది. ఐతే కరోనా కారణంగా ఇంటి దగ్గరే ఉంటున్న రమ్యకు మరో కష్టం వచ్చింది. తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా కోవిడ్ బారినపడడంతో.. వాళ్లకు అన్నీ తానై సపర్యలు చేసింది. పొలం పనులు నిలిచిపోతే తానే స్వయంగా దుక్కి దున్ని.. నారుపోసి ఒంటిచేత్తో వ్యవసాయ పనులు చేస్తోంది. చదువుకు తాత్కాలికంగా బ్రేకులేసి.. పొలం పనుల్లో నిమగ్నమైంది.

చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటల్లోనూ రమ్య ప్రతిభ కనబరిచేది. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీల్లో అవార్డులు సాధించగా.. కొన్ని కారణాల వల్ల జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనలేక పోయింది. గిరిజన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు.. జాతీయ స్థాయిలో వారిని రాణించేలా చేసేందుకే.. తాను పీఈటీ కోర్సు చేస్తున్నానని రమ్య అంటోంది. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. ఇది తనలో మరింత పట్టుదల పెంచుతోందని చెప్తోంది.గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలన్న ఆలోచనతో ఉన్న రమ్యకు.. సరైన ప్రోత్సాహం అందించాలని స్థానికులు కోరుకున్నారు. ఆమెకు చేయూత అందిస్తే.. కొత్త ప్రతిభ ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.