కృష్ణా నది జల వివాదం : నీటి వాటా తేల్చేందుకు కేసీఆర్ కసరత్తు

కృష్ణా నది జల వివాదం : నీటి వాటా తేల్చేందుకు కేసీఆర్ కసరత్తు

krishna river water dispute : కృష్ణా నది జలవివాదం కొనసాగుతునే ఉంది. రెండు రాష్ట్రాల నీటి వాటాను తేల్చే విషయంలో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు.. రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా ఏం చేస్తే బాగుంటుందనే దానిపై అధికారులు కూడా మేథో మథనం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించింది. ఇది తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బందికరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని ఇటీవల ప్రకటించారు సీఎం కేసీఆర్.

తెలంగాణను సంప్రదించకుండా.. ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం నీటి విషయంలో ఏపీ తలదూర్చడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేకుండా పోరాటం చేస్తామని తెలిపారాయన. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా తెలిపింది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్ట్‌. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేసింది.

కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుందనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమైనప్పుడు దీనిపై సమగ్రంగా వివరించారు. దీంతో.. కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ, తెలంగాణలు ప్రాజెక్టుల డీపీఆర్ అందించాలని ఆదేశించారు. కేంద్ర అమోదం తెలిపే వరకు ముందుకు వెళ్లవద్దని రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు గజేంద్ర సింగ్ షెకావత్. మరోవైపు.. కృష్ణా జలాలను ఒక సీజన్‌లో వాడుకోకపోతే.. మరో సీజన్‌కు క్యారీ ఫార్‌వర్డ్‌ చేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియమాకాల కోసం తెచ్చుకున్నామనే.. విషయాన్ని ఏపీకి తెలిపేలా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.