TSPSC paper leak: రేవంత్, బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాజకీయ స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే తనను ఇందులోకి లాగుతున్నారని తెలిపారు.

TSPSC paper leak
TSPSC paper leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లీకేజీ విషయంలో రాజకీయ రగడ చెలరేగుతోంది. లీకేజీ కేసులో తనకు నోటీసులు ఇచ్చినట్లే రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR)కి కూడా ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేటీఆర్ పై పలు ఆరోపణలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాజకీయ స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే తనను ఇందులోకి లాగుతున్నారని తెలిపారు. తెలంగాణలో తాము చేపడుతున్న ఉద్యోగాల జాతరకు కొనసాగకూడదనే విపక్షాలు భావిస్తున్నాయని, ఆ ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. నియామకాల జాతరను ఆపాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
ఆ పార్టీల నేతలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వం వేర్వేరనే జ్ఞానమూ లేదని కేటీఆర్ చెప్పారు. ఇటవంటి రాజకీయాల ఉచ్చులో యువత చిక్కుకోవద్దని చెప్పారు. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ఆపకూడదని సూచించారు. కాగా, టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతోన్న విచారణలో ఎన్నో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. టీఎస్పీఎస్సీ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.