Lands for sale: ప్రభుత్వ భూముల అమ్మకాలు.. ఖజానా నింపడమే టార్గెట్!
కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ సర్కార్ ఖజానాను నింపేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
Telangana Govt: కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ సర్కార్ ఖజానాను నింపేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రియల్ బూమ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అమ్మకానికి ముహుర్తం ఖరారు చేసింది. కోకాపేట్, ఖానామెట్లోని సర్కార్ భూముల అమ్మేందుకు సిద్ధం అవుతోంది. కరోనా సంక్షోభంతో కుదేలైన ఖజానాను భూముల అమ్మకం ద్వారా రూ.15వేల కోట్లు రాబట్టడమే టార్గెట్గా పెట్టుకుంది తెలంగాణ సర్కార్.
రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో నిరూపయోగంగా ఉన్న సర్కార్ భూములను గుర్తించిన ప్రభుత్వం.. వాటిలో కొన్ని భూముల అమ్మకానికి ముహూర్తం ఖరారు చేసింది. కోకాపేట్లోని 49.92 ఎకరాలను ఎనిమిది ప్లాట్లుగా విభజించింది. ఖనామెట్ లో ఉన్న 15.01 ఎకరాల భూమిని 5 ప్లాట్లుగా విభజించి వేలానికి సిద్ధమైంది. వీటిలో కోకాపేట్లోని భూములను హెచ్ఎండిఏ ద్వారా, ఖానామెట్ లోని భూములను టిఎస్ఐఐసీ ద్వారా వేలం వేయనుంది. దరఖాస్తు కోసం ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా ఈనెల 15వ తేదీ నుంచి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఇచ్చింది. వచ్చే నెల 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించగా.. వచ్చేనెల 15వ తేదీన HMDA ఈ-వేలం ప్రక్రియ నిర్వహించనుంది. ఆ మరుసటి రోజే టీఎస్ఐఐసీ వేలం పాట జరగనుంది.
ఈ-వేలంలో 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా పాల్గొనవచ్చు. వ్యక్తులు, సంస్థలు, ట్రస్టులు, కంపనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, రిజిస్టర్ సోసైటీలు, బ్యాంకులు ఇలా ఎవరైనా వేలంలో పాల్గోవచ్చని ప్రభుత్వం తెలిపింది. వేలంలో పాల్గొనే వారు వాణిజ్య పరమైన, బహుల ప్రయోజనాల కోసం ఆస్తులను కలిగి, నిర్మించడానికి, కాంట్రాక్ట్ అర్హత కల్గి ఉండాలని తెలిపింది సర్కార్. ప్రభుత్వ నిబంధనల మేరకు 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు ఆవకాశం కల్పించింది. RBI, ఫెరా, ఫెమా నిబంధనలకు లోబడి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఈ వేలం పాటలో పాల్గొనవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
కోకాపేట్, ఖానామెట్ లోని భూముల వేలం తర్వాత.. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోయిన రాజధానిలోని మరిన్ని భూములను వేలం వేయనుంది ప్రభుత్వం. ఈ లిస్ట్ లో శేరిలింగంపల్లిలో 5 ఎకరాలు, గండిపేట్, మంచిరేవుల, మణికొండ పరిధిలో ఉన్న మరో 80 ఎకరాలు, విజయవాడ హైవేలోని అబ్దుల్లాపూర్ మెట్ లో 64 ఎకరాల భూములను వేలం వేసే అవకాశం ఉంది. మొత్తానికి బడ్జెట్ లో చెప్పినట్లుగా భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వం 20 వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తుంది. మరి ఈ భూముల వేలం ద్వారా సర్కార్ ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.