ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పొడిగింపు
LRS application extension : తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు హైదరాబాద్లో 2 లక్షల 58వేల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 19.33 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 2020, అక్టోబర్ 15వ తేదీతో గడువు ముగియడంతో మరోసారి గడువు పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో దరఖాస్తుల గడువు పొడిగించినట్లు తెలిపింది.
అనధికారిక లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ జరగాలన్న ఉద్దేశంలో భాగంగా ఎల్ఆర్ఎస్ ను రూపొందించారు. 2020, అక్టోబర్ 14 సాయంత్రం వరకు ప్రభుత్వానికి 16,28,844 దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. ఇందులో గ్రామ పంచాయతీల పరిధిలో 6,67,693 దరఖాస్తులు, మునిసిలిటీల్లో 6,70,085, కార్పొరేషన్ల పరిధిలో 2,91,066 ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్రమంగా పుట్టుకొచ్చిన వెంచర్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసేందుకు తీసుకొచ్చిన లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఎంతో మందికి సంతోషానిచ్చింది. ఎల్ఆర్ఎస్ లేకపోతే..రిజిస్ర్టేషన్లు జరిగే అవకాశం లేకపోవడం, నిర్మాణాలకు అనుమతించకపోవడం వంటి నిబంధనలతో ఆందోళనలో ఉన్న యజమానులు… దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1000, లే అవుట్ అప్లికేషన్ ఫీజు రూ. 10 వేలు.
రెగ్యులరైజేషన్ ఛార్జీలు 100 గజాలలోపు ప్లాట్లకు గజానికి రూ. 200.
100 నుంచి 300 గజాల వరకు రూ. 400 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.
300 నుంచి 500 వరకు గజానికి రూ. 600 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.
530 గజాలున్న ప్లాట్లకు రూ. 700 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.