కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులకు గాయాలు

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులకు గాయాలు

maharastra RTC bus overturned  :  కామారెడ్డి పట్టణ శివారులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టేక్రియాల్ 44వ జాతీయ రహదారిపై మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలోనే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఇందుకు డ్రైవర్ అతివేగం కూడా కారణంగా భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.