Khammam : ఊరుకాని ఊరులో ఆ నలుగురే తోడు..స్నేహితుడి శవాన్ని రిక్షాలో….
తెలుగు సినిమాలో ఒక డైలాగు ఉంది... డబ్బు లేకుంటే ఈదేశంలో చావు కూడా ప్రశాంతంగా సాగదని... అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసంఘటనలు చూసినప్పుడు.
Khammam : తెలుగు సినిమాలో ఒక డైలాగు ఉంది… డబ్బు లేకుంటే ఈదేశంలో చావు కూడా ప్రశాంతంగా సాగదని… అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసంఘటనలు చూసినప్పుడు. మన చుట్టు పక్కల వారికి ఎంత కష్టం వచ్చినా అయ్యో అని వదిలేస్తామే తప్ప సాయం చేయటానికి ఎవరూ ముందుకు రాని పరిస్ధితులు ఉన్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులలో మరణించిన మృతదేహాలను తరలించటానికి కూడా అంబులెన్స్ డ్రైవర్లు ఎలా ప్రవర్తించారో ఎంతెంత డబ్బులు డిమాండ్ చేశారో ఇటీవలి కాలంలో మనం చూశాము. తాజాగా ఖమ్మంలో ఒకవ్యక్తి రైల్వే స్టేషన్లో చనిపోతే అతడి శవాన్ని తరలించటానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవటం శోచనీయం. చివరికి అతని మిత్రులు రిక్షామీద తీసుకుని శవాన్ని మార్చురీకి తరలించారు.
వివరాలలోకి వెళితే….ఉత్తరప్రదేశ్లోని కన్నోజ్ జిల్లా ధ్యాస్పూర్ గ్రామానికి చెందిన ములకరాజ్(37) అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు స్నేహితులతో కలిసి జీవనోపాధి కోసం కొన్నాళ్ళ క్రితం తెలంగాణలోని సూర్యాపేటకు వచ్చి ఐస్ క్రీం వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేట సమీపంలోని అయిటిపాముల వద్ద ఐస్ క్రీం విక్రయిస్తుండగా ద్విచక్ర వాహానం వచ్చి ములకరాజ్ను ఢీ కొట్టింది.
గాయపడిన అతడిని స్నేహితులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేయించిన తర్వాత వారు అక్కడ నుంచి సూర్యాపేటకు పంపించారు. వైద్యులు అతడిని పరీక్షించి … పరిస్ధితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. హైదరాబాద్ తీసుకువెళ్లి వైద్యం చేయించే ఆర్ధిక స్ధోమత లేని స్నేహితులు సొంతూరుకు వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయారు.
అందుకోసం రైలు ఎక్కేందుకు స్నేహితులు ఐదుగురు మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్నాక బాగానే ఉన్న ములకరాజ్ విశ్రాంతి కోసం ప్లాట్ ఫాంపై పడుకున్నాడు. అలా నిద్రపోతూనే ములకరాజ్ తుదిశ్వాస విడిచాడు. స్నేహితుడు మరణించాడనే విషయం తెలుసుకున్నస్నేహితులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ప్లాట్ ఫాం నుంచి మార్చురీకి తరలించాలని ఆదేశించారు.
స్నేహితులు రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆటోవాలాలను, ప్రైవేట్ వాహనాలను అడిగితే వారు 5 వేల రూపాయలు అడిగారు. అంత డబ్బు ఇచ్చుకోలేని స్నేహితులు చివరకు ఒకరిక్షా కార్మికుడికి 500 రూపాయలు ఇచ్చి తమ మిత్రుడు మృతదేహాన్ని రిక్షాలో వేసుకుని మండు టెండలోనడుచుకుంటూ ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read : National Herald Case : మూడోరోజూ విచారణకు హాజరు కానున్న రాహుల్ గాంధి