ఊరినే కబ్జా చేసేశాడు.. 19 ఏళ్ల తర్వాత వెలుగులోకి..

ఊరినే కబ్జా చేసేశాడు.. 19 ఏళ్ల తర్వాత వెలుగులోకి..

Vooru

ఎక్కడైనా జాగా కబ్జా చెయ్యడం చూసి ఉంటాం.. పొలం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చూసి ఉంటాం.. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా ఆదివాసీల గ్రామాన్ని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో వేణునగర్‌ ఆదివాసీలు గతంలో అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుగూడలో నివసించేవారు. 2000 సంవత్సరంలో ఆ ఊరి నుంచి పెంబి వెళ్లే మార్గంలో రహదారి పక్కనే మందపల్లికి చెందిన దేవ నడ్పి పెద్దులు, చిన్న పెద్దులు, దేవ బక్కన్నల వద్ద సర్వే నం.55/2లో 4.32 ఎకరాల అసైన్డ్‌ (వ్యవసాయ) భూమిని రూ.60 వేలకు కొనుగోలు చేశారు.

అనంతరం గుడిసెలు వేసుకుని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ భూమినే పెంబికి చెందిన ఓ వ్యాపారి 2002లో తన భార్య పేరిట నిర్మల్‌లో రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. భూమిని అమ్మినవారికి కానీ, కొన్నవారికి కానీ ఈ విషయం తెలియకపోవడం విచిత్రం.

ఆదివాసీలకు భూమి అమ్మిన విషయమై సాక్షి సంతకాలు కావాలని చెప్పి.. దేవ నడ్పి పెద్దులు, చిన్న పెద్దులు, దేవ బక్కన్నల సంతకాలు తీసుకుని సదరు వ్యాపారి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. సుమారు రూ. కోటి పలుకుతున్న ఈ భూమి ‘ధరణి’లో వ్యాపారి భార్య పేరుపై అసైన్డ్‌ భూమిగా నమోదై ఉండగా.. భూమిపై మూడేళ్ల నుంచి రైతుబంధు సాయం సైతం సదరు వ్యాపారి పొందుతున్నారు.

గ్రామపంచాయతీగా మారిన వేణునగర్‌లో ప్రస్తుతం 50కి పైగా కుటుంబాలు నివాసం ఉండగా.. వ్యాపారి వచ్చి.. ఆ భూమి తనదని చెప్పడంతో అసలు విషయం 19ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది.