హైదరాబాద్‌లో విషాదం, ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : July 6, 2020 / 08:46 AM IST
హైదరాబాద్‌లో విషాదం, ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య

హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా లక్షణాలతో పది రోజుల నుంచి బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడు చికిత్స చేయాలని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆ ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వారు నిరాకరించి గాంధీకి వెళ్లమన్నారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. తాను ఇక ఎన్నో రోజులు బతకనని భావించిన ఆ వ్యక్తి హుస్సేన్‌ సాగర్‌లో దూకి గల్లంతయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

10 రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు:
వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన పల్టుపాన్‌ (34) కొద్ది సంవత్సరాల క్రితం భార్య రోమాపాన్‌తో సహా నగరానికి వచ్చి దూద్‌బౌలిలో స్థిరపడ్డాడు. పల్టుపాన్‌ గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 10 రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ క్లినిక్‌లో చికిత్స తీసుకుంటున్నా తగ్గలేదు.

covid 19

ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించిన యశోద, మనస్తాపంతో ఆత్మహత్య:
అక్కడి డాక్టర్ల సూచన మేరకు గురువారం, శుక్రవారం చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లాడు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు రోజుల పాటు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా బెడ్లు లేవని చెప్పి అతన్ని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. తనకు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవుతుందని కాళ్ల వేళ్ల పడినా కనికరించకుండా గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. శుక్రవారం సమస్య మరింత తీవ్రం కావడంతో పాటు శ్వాస తీసుకోవడానికి మరింత ఇబ్బంది వచ్చింది. తీవ్ర భయాందోళనకు గురైన అతడు శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు శ్రీరాములుకు ఫోన్‌ చేశాడు. అతడు రాగానే తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని హుస్సేన్‌ సాగర్‌ దగ్గరకు వెళితే చల్లటి గాలి వస్తుందని అక్కడికి తీసుకుని వెళ్లాలని కోరాడు.

చల్లటి గాలి కోసం హుస్సేన్ సాగర్ కు వచ్చి:
దీంతో ఇద్దరు కలిసి శుక్రవారం(జూలై 3, 2020) రాత్రి 7.55 గంటల సమయంలో ఆటోలో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఆటోను ట్యాంక్‌బండ్‌పై ఉండే పూజా స్టాల్‌ లేపాక్షి మధ్యలో నిలిపి తాను కొద్దిసేపు అలా తిరిగి వస్తానని పల్టుపాన్‌ ముందుకు నడుచుకుంటూ వెళ్లాడు. అంతలోనే అమాంతం హుస్సేన్‌ సాగర్‌లోకి దూకాడు. వెంటనే శ్రీరాములు దీన్ని గమనించి రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే వాళ్లు అక్కడికి చేరుకుని నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. కరోనా కారణంగా తీవ్ర ఒత్తిడి, బతకనేమో అనే భయంతోనే అతడు ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రజల్లో ఉన్న కరోనా భయానికి అద్దం పట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల తీరు వల్లే అతడి ప్రాణం పోయిందనే విమర్శలు వస్తున్నాయి. అందుకే కరోనా సోకకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో దగ్గు, జలుబు, జ్వరం వచ్చినంత మాత్రాన కరోనా సోకిందేమో అని భయపడాల్సిన పని లేదు. అవి సీజనల్ జబ్బులు కూడా కావొచ్చు.

Read Here>>ఏమాత్రం భయం లేదు…కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బర్త్ డే పార్టీ