Medak Lok Sabha Constituency : మెతుకు సీమ మెదక్.. బువ్వ పెట్టే ప్రాంతమే కాదు.. బతుకు నేర్పే నేల, బతుకును ప్రతిబింబించే నేల ఇది ! ఇందిరా గెలిచింది ఇక్కడే.. కేసీఆర్ నిలిచింది ఇక్కడే…. గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా పోటీ చేసిందీ ఇక్కడే ! ఇందిరా గాంధీ రాజకీయ ప్రస్థానం మాట్లాడుకున్న ప్రతీసారి.. మెదక్ మాట ముందుగా వినిపిస్తుంది. అలాంటి పార్లమెంట్ స్థానం.. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకం ! మెదక్ ఎంపీతో పాటు అసెంబ్లీలను క్లీన్స్వీప్ చేయాలని బీఆర్ఎస్ టార్గెట్గా పెట్టుకుంటే.. ఒకప్పటి కంచుకోటలో బౌన్స్బ్యాక్ అవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అవసరం అయితే ప్రియాంకను బరిలోకి దింపాలని ప్రయత్నిస్తోంది. మెదక్ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా గురి పెట్టిన బీజేపీ.. ఆచీతూచీ అడుగులు వేస్తోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంతకీ మెదక్ ఫైట్లో ఏ పార్టీ స్ట్రాటజీ ఏంటి.. ప్రియాంక నిజంగా పోటీ చేస్తారా.. కాంగ్రెస్ సంధించబోయే అస్త్రాలేంటి.. బీజేపీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి..
మెదక్లో మళ్లీ పట్టు సాధించే దిశగా కాంగ్రెస్…పార్లమెంట్ బరిలో ప్రియాంక గాంధీ?
మెదక్.. రాజకీయం నేర్పిన నేల.. రాజకీయానికి నాయకత్వం చూపిన నేల.. ఇందిరాగాంధీ నుంచి కేసీఆర్ వరకు.. హత్తుకొని పార్లమెంట్ను చేర్చిన నేల ! అందుకే రాజకీయంలో మెదక్ స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. మెదక్ పార్లమెంట్ స్థానం.. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ నుంచి.. వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీని బరిలోకి దింపేలా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా మెదక్ హాట్ సీట్ అవుతుంది. ఇక గులాబీ పార్టీ ఆవిర్భావం తర్వాత.. కారు జోరుకు బ్రేకుల్లేకుండా పోయాయ్. 2004 నుండి 2019వరకు వరుసగా ఐదుసార్లు గులాబీ పార్టీనే విజయం సాధించింది. ఆలె నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్ ఒక్కోసారి విజయం సాధించగా… ప్రస్తుత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. సంగారెడ్డి మినహా అన్ని సెగ్మెంట్లలోనూ అధికార పార్టీదే విజయం.
ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేని ప్రభాకర్ రెడ్డి…బీజెపీ అభ్యర్ధినిగా విజయశాంతి పోటీపై సందిగ్ధత
మెదక్ సిట్టింగ్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఐతే ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అదే జరిగితే.. బీఆర్ఎస్ నుంచి ఎంపీగా బరిలోకి దిగేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గాలి అనిల్ కుమార్.. ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పటాన్చెరు, నర్సాపూర్లో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మాజీ ఎంపీ విజయశాంతి.. ఈసారి పార్లమెంట్కు పోటీ చేస్తారా, అసెంబ్లీకా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి మూడు పార్టీల తరఫున బరిలో దిగేది ఎవరు అనే స్పష్టత లేకుండా పోయింది. జాతీయ రాజకీయాలపై గురి పెట్టిన వేళ.. కేసీఆర్ బరిలో దిగే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఏమైనా ఇక్కడి నేతలంతా ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొని… ఆ తర్వాత అవసరాలను బట్టి.. లోక్సభకు పోటీపై దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్ అసెంబ్లీతో పాటు.. సిద్ధిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ స్థానాలు ఉన్నాయ్. అక్కడి రాజకీయ పరిస్ధితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
READ ALSO : Chevella Lok Sabha Constituency : చెమట్లు పట్టిస్తోన్న చేవెళ్ల పార్లమెంట్ రాజకీయం…ట్రయాంగిల్ ఫైట్ తప్పదా ?
సిద్ధిపేట నుంచి మళ్లీ బరిలో హరీష్….ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కష్టమే..
సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతీ ఎన్నికలోనూ మెజారిటీ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న హరీష్ రావు.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ దక్కే అవకాశం కూడా ఇవ్వడం లేదు. సిద్ధిపేట నుంచి మళ్లీ హరీష్ బరిలోకి దిగబోతుండగా.. ఆయనను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థుల కోసం విపక్ష పార్టీలు అన్వేషణ ప్రారంభించాయ్. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన.. నరోత్తమ్ రెడ్డి.. మరోసారి బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి కూడా.. సిద్ధిపేట నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నుంచి పూజల కృష్ణతో పాటు.. గతంలో పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్, దరిపెల్లి చంద్రం పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్.
దుబ్బాకలో బీజెపీకి తలనొప్పిగా మారిన వర్గపోరు…సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ కు వ్యతిరేకంగా పావులు
తెలంగాణ రాజకీయం గురించి దేశం చర్చించుకునేలా చేసిన స్థానం దుబ్బాక ! ఉపఎన్నికలో బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు.. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఈసారి ఆయనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నా.. వర్గపోరు కమలం పార్టీని ఇబ్బంది పెడుతోంది. రఘునందన్కు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్లు అంతా ఏకం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డితో పాటు మరో సీనియర్ నాయకుడు గిరీష్ రెడ్డి.. రఘునందన్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఐతే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేలా.. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలని బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేస్తోంది. బైపోల్లో ఓడిన దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత కూడా.. మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నా.. ఆమెకు చాన్స్ దక్కడం దాదాపు అనుమానమే! కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చెరకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి.. మరోసారి పోటీలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తుండగా.. గతంలో మెదక్ పార్లమెంట్కు పోటీ చేసి ఓడిన శ్రవణ్ రెడ్డి కూడా బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఇద్దరూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండడంతో.. టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మెదక్ నుండి పార్లమెంట్ బరిలోకా….గజ్వేల్ నుండి అసెంబ్లీకా సందిగ్ధంలో కేసీఆర్
గజ్వేల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న వ్యూహంలో భాగంగా.. మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తే.. ఇక్కడ వంటేరు ప్రతాపరెడ్డికి అవకాశం దక్కుతుంది. బీఆర్ఎస్ను ఎదుర్కొనే బలమైన అభ్యర్థులు ఎవరూ.. కాంగ్రెస్, బీజేపీలో కనిపించడం లేదు. గతంలో సవాల్ విసిరినట్లు.. ముఖ్యమంత్రిపై ఈటల పోటీకి దిగితే… గజ్వేల్ పోరు రసవత్తరంగా మారడం ఖాయం. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పోటీలో నిలవాలని చూస్తుండగా.. జస్వంత్ రెడ్డి అనే మరో నేత కూడా సీటుకోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరూ లేరు. నందన్ గౌడ్ అనే సీనియర్ నేత.. టికెట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నర్సాపూర్ లో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన మదన్ రెడ్డి…ఈసారి సునీతా లక్ష్మారెడ్డి కేసీఆర్ సీటే కేటాయించే ఛాన్స్
నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మదన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ సన్నిహితుడిగా ఈయనకు పేరు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన మదన్ రెడ్డి.. హ్యాట్రిక్ కొట్టి తీరాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న మదన్ రెడ్డి స్థానంలో.. మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డికి సీటు ఖరారు చేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఈ మధ్యే కమలం కండువా కప్పుకున్న నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్తో పాటు.. సింగారపల్లి గోపీ బీజేపీ నుంచి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. సీటు కన్ఫార్మ్ చేసుకున్నాకే మురళీ యాదవ్ పార్టీ మారారని.. అధిష్టానం కూడా ఆయన వైపే అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున ఆంజ నేయులు గౌడ్, గాలి అనిల్ కుమార్ పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్.
పటాన్చెరులో సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి అసమ్మతి సెగ….
మెదక్ పార్లమెంట్లోనే అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా పటాన్చెరు సెగ్మెంట్కు పేరు ఉంది. ఐతే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అన్ని పార్టీల్లోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. మినీ భారత్ను తలపించే పటానుచెరులో గూడెం మహిపాల్ రెడ్డి.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే పార్టీ కేడర్లో ఆయనపై భారీగా అసమ్మతి పెరిగింది. ఉద్యమకారులను పక్కనపెట్టి.. కొత్త వారికే మహిపాల్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ.. బీఆర్ఎస్ కేడర్ అలకతో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం భారీగా పోటీ కనిపిస్తోంది. చిట్కూల్ సర్పంచ్ నీలం మధు.. మహిపాల్ రెడ్డికి దీటుగా కార్యక్రమాలను చేస్తూ… అధిష్టానం దృష్టిలో పడేలా ముందుకు సాగుతున్నారు. కేటీఆర్కు సన్నిహితుడైన తనకు.. వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయం అని నీలం మధు ధీమాతో ఉన్నారు. బొల్లారంకు చెందిన కొలను బాల్ రెడ్డి కూడా పోటీకి సై అంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కూడా.. తన కుటుంబంలో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని అంటున్నారు. వీరందరితో పాటు.. మాజీ ఐఏఎస్ అధికారి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి అవకాశం ఉందంటూ కొత్త ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ నుంచి గాలి అనిల్ కుమార్, కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ పడుతున్నారు. గాలి అనిల్ కుమార్కు మెదక్ లోకసభ లేదా నర్సాపూర్ శాసనసభ బరిలో ఛాన్స్ దక్కితే… కాటా శ్రీనివాస్ గౌడ్కు రూట్ క్లియర్ అయ్యే చాన్స్ ఉంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి, గడీల శ్రీకాంత్ గౌడ్.. ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి…కమలం పార్టీ నుండి విజయశాంతి పోటీ చేసే ఛాన్స్
మెదక్ అసెంబ్లీ స్థానంలో పద్మా దేవేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్లకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించగా.. ఈసారి కూడా పద్మాదేవేందర్ రెడ్డి పోటీకి సిద్ధం అవుతుండగా.. ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి కూడా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి.,.. కోనాపూర్ కో ఆపరేటివ్ సొసైటీ అవకతవకల్లో ఇరుక్కున్నారు. దీంతో వ్యతిరేకత మరింత పెరిగిందనే ప్రచారం సాగుతోంది. దీంతో పద్మాదేవేందర్కు ఈసారి టిక్కెట్ దక్కకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది. దీంతో షేరి సుభాష్ రెడ్డి పేరు ప్రచారంలోకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, చౌదరి సుభ్రభాతరావు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విజయశాంతి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఐతే మెదక్లో అంతంతమాత్రం బలం ఉన్న కమలం పార్టీ నుంచి రాములమ్మ పోటీ చేసే సాహసం చేస్తారా అనే చర్చ సాగుతోంది. విజయశాంతి పోటీకి దిగకపోతే.. తాళ్లపల్లి రాజశేఖర్కు టికెట్ చాన్స్ ఉంటుంది.
సంగారెడ్డి లో బలం పెంచుకున్న కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి…
మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ చేతుల్లో ఉన్న ఒకే ఒక్క నియోజకవర్గం సంగారెడ్డి. కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ జగ్గారెడ్డి.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకంగా బలం పెంచుకున్న జగ్గారెడ్డికి.. టికెట్ విషయంలో ఎవరూ పోటీ లేరు.. రారు కూడా ! సంగారెడ్డిలో కాంగ్రెస్ అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే కాంగ్రెస్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన చింతా ప్రభాకర్కు.. ఆశావహులు స్ట్రోక్ల మీద స్ట్రోక్లు ఇస్తున్నారు. డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజు కూడా టికెట్ ఆశిస్తూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఐనా మరోసారి చింతాకే సీటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి చంద్రశేఖర్, దేశ్ పాండే.. ఎవరికి వారు ఈసారి టికెట్ తమకే అనే ధీమాతో న్నారు. ఈ మధ్యే బీజేపీలో చేరిన ఉద్యోగ సంఘాల నేత విఠల్ కూడా… సంగారెడ్డి నుంచి బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన డాక్టర్ రాజు కూడా టికెట్ రేసులో ఉన్నారు.
మెదక్ పార్లమెంట్.. గులాబీ పార్టీకి సెంటిమెంట్ మాత్రమే కాదు.. టన్నుల కొద్దీ స్ట్రెంత్ కూడా ! పార్లమెంట్తో పాటు అసెంబ్లీలను క్లీన్స్వీప్ చేయాలని బీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంటే.. ఒకప్పుడు కంచుకోట అయిన మెదక్లో బౌన్స్బ్యాక్ కావాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దుబ్బాకలో ఝలక్ ఇచ్చినట్లు.. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని కమలం పార్టీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఐతే అధికార బీఆర్ఎస్లోనే కాదు.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలోనూ ఆశావహులు ఎక్కువగానే కనిపిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం ఊపందుకోవడంతో.. రాజకీయం మరింత వేడెక్కింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. సిద్ధం అన్నట్లుగా పార్టీలన్నీ అడుగులు వేస్తున్నాయ్. సీటు ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఆశావహుల్లో.. ఎంతమంది కండువాలు మారుస్తారు…ఏ పార్టీకి నష్టం చేకూరుస్తారనే టెన్షన్ అయితే రాజకీయవర్గాల్లో క్లియర్గా కనిపిస్తోంది మెదక్లో!