Microsoft Hyderabad : హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి.. రూ.15వేల కోట్లతో డేటా సెంటర్
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో(Microsoft Hyderabad) తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
Microsoft Hyderabad : తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రముఖ సంస్థలైన చాలా కంపెనీలు తమ యూనిట్లను తెలంగాణలో ఏర్పాటు చేశాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఏర్పాటు కానున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆ సంస్థకు సంబంధించి అతిపెద్ద డేటా సెంటర్గా నిలవనుంది. ఈ డేటా సెంటర్ కోసం మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు డేటా సెంటర్ను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. భారత దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్కు మైక్రోసాఫ్ట్ రూ.15వేల కోట్లు ఇన్వెస్ట్ చేయడం హర్షనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రానున్న అతిపెద్ద ఎఫ్డీఐ అవుతుందని ఆయన అన్నారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణకు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్లో అత్యంత పెద్ద డేటా సెంటర్ను ఆ కంపెనీ ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని, తెలంగాణ-మైక్రోసాఫ్ట్ మధ్య రిలేషన్ పెరగడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభా పెరుగుతున్న కారణంగా టెక్నాలజీ పరంగా మరింతగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్లో తన నాలుగో డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఈ డేటా సెంటర్ గురించి గత ఏడాదే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది మైక్రోసాఫ్ట్.
Zoomకు ధీటుగా Microsoft.. ఒకేసారి స్క్రీన్పై 49మందిని చూడొచ్చు
హైదరాబాద్ లో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా.. ప్రస్తుతం పుణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న డేటా సెంటర్లకు అదనంగా ఈ కొత్త కేంద్రం సేవలను అందించనుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. క్లౌడ్, ఏఐ ఆధారిత డిజిటల్ ఎకానమీ కస్టమర్లకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యూహాత్మకంగా ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
మైక్రోసాఫ్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్న క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడెక్టివిటీ టూల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్ మెంట్ లో సర్వీసులు ఇవ్వనుంది. వ్యాపార సంస్థలకు, స్టార్టప్స్, డెవలపర్స్, ఎడ్యుకేషన్, గవర్నెమంట్ సంస్థలకు ఈ సేవలు అందనున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వల్ల భారత్ లో త్తగా 15 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ఓ స్టడీ ద్వారా తేలింది. దీనికి తోడు 169000 కొత్త ఐటీ జాబ్స్ ఇచ్చారు.
దేశంలో డేటా అవసరాలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, సెంటర్లను నెలకొల్పడానికి పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ సంస్థలను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్ల వరకూ ఉండగా, ఇది 2023 నాటికి 96 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. తెలంగాణ ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత వంటి కారణాలతో డేటా కేంద్రాలు ఏర్పాటుకు కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నాయి. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్తో పాటు మరికొన్ని కంపెనీలు రాబోతున్నట్లు తెలుస్తోంది. డేటా సెంటర్తో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి.
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్తో డిజిటల్ ఎకానమీలో పోటీతత్వం పెరుగుతుందని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అన్ని పరిశ్రమలు, రంగాల్లోనూ క్లౌడ్ కీలకంగా మారుతోందన్నారు.
Happy to announce that Hyderabad will be the destination for @Microsoft largest Data Center investment in India with an investment of over ₹15,000 crores#HappeningHyderabad#TriumphantTelangana
An iconic moment in the development story of Telangana! pic.twitter.com/6XC8t386zY
— KTR (@KTRTRS) March 7, 2022