Harish Rao : పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి-హరీష్ రావు
నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య
Harish Rao : నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. సోమవారం ఆయన నిలోఫర్, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విభాగాల వారీగా పనితీరు గురించి మంత్రి సమీక్షించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై ఆరా తీశారు. ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్ లో ఇందులో ఆసుపత్రులు నడపడానికి రూ. 1100 కోట్లు, మందుల కోసం రూ. 500 కోట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రూ. 300 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.500 కోట్లు, సర్జికల్ కోసం రూ. 200 కోట్లు కేటాయించుకోవడం జరిగిందన్నారు. దీంతో పాటు డైట్ చార్జీల కోసం రూ. 43.5 కోట్లు కేటాయించుకున్నామని, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను రూ.40 నుంచి 80, టీబీ, క్యాన్సర్ రోగులకు రూ.56 నుంచి రూ.112కు పెంచుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు చెల్లింపులను బెడ్కు 5,016 నుండి 7,500 లకు పెంచామన్నారు. మరోవైపు మెడికల్, నర్సింగ్, పారామెడికల్ సహా అన్ని విభాగాల్లో సిబ్బందిని వంద శాతం నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందరం కలిసికట్టుగా పని చేసి తెలంగాణ వైద్యారోగ్య శాఖను దేశానికే ఆదర్శంగా నిలపాలన్నారు.
నిలోఫర్, గాంధీ ఆసుపత్రులపై నమ్మకం మరింత పెరిగేలా సేవలందించాలనిహరీష్ రావు వైద్యులకు సూచించారు. రోగులకు అన్ని వేళల్లో అత్యవసర వైద్య సేవలు అందాలని, ఆరోగ్య శ్రీ కేసులు మరింత పెరగాలన్నారు. గాంధీలో మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలతో పాటు ఇతర అవయవ మార్పిడి సర్జరీలు పెరగాలన్నారు. దీంతో పాటు సంతానోత్పత్తి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు.
సి-సెక్షన్ డెలివరీలు తగ్గించి, సాధారణ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా చూడాలన్నారు. వివిధ విభాగాల వారీగా జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకి వైద్య సేవలు చేరువ చేయాలనీ గాంధీ వైద్యులకు సూచించారు. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో గాంధీ వైద్యులు, సిబ్బంది బాగా పని చేశారని అభినందించారు.
Also Read : Gold Smuggling : అండర్ వేర్ లో రూ.1 కోటి 70 లక్షల బంగారం స్మగ్లింగ్
నిలోఫర్ ఆసుపత్రిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలుగా బాక్స్లు ఏర్పాటు చేయాలన్నారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. బాగా పని చేసే వైద్యులకు ఈనెల 7న వరల్డ్ హెల్త్ డే పురస్కరించుకొని నగదు పురస్కారం, సన్మానం చేయనున్నట్లు తెలిపారు. ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తూ, ఆపరేషన్ థియేటర్ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు.
పరీక్షల ఫలితాలు సకాలంలో పేషెంట్లకు అందించాలని, వైద్య సేవలు అందించడంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదన్నారు. ఆసుపత్రుల్లో చిన్న చిన్న రిపేర్లను తక్షణం పరిష్కరించు కోవాలన్నారు. నిలోఫర్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న 800 పడకల బ్లాక్ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.