ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ, రేట్లు తగ్గుతాయా
Minister KTR To Release New Electric Vehicle Policy : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని మంత్రి కేటీఆర్ 2020, అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఉదయం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో దీనిని విడుదల చేస్తారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుంది.
ఇందుకోసం రాష్ట్రంలోనే తయారీ యూనిట్లు, చార్జింగ్ పాయింట్లను పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా రాయితీలను ప్రకటించింది ప్రభుత్వం. తొలి 2 లక్షల ఎలక్ర్టిక్ ద్విచక్ర వాహనాలు, 20 వేల మూడుచక్రాల ఆటోలు, 5వేల నాలుగు చక్రాల వాహనాలు, 10 వేల లైట్ గూడ్స్ వాహనాలు, 5 వేల ఎలక్ర్టిక్ కార్లు, 500 ఎలక్ర్టిక్ బస్సులకు రహదారి పన్ను, రిజిస్ర్టేషన్ రుసుం మినహాయింపు ఇవ్వనుంది.
ఎలక్ర్టిక్ ట్రాక్టర్లకు రహదారి పన్ను, రిజిస్ర్టేషన్ రుసుం పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ర్టిక్ వాహనాల వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుంది. ప్రజా రవాణా వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాల కోసం అవసరమైన చర్యలను తీసుకొంటోంది ప్రభుత్వం.