mobile fish vehicles : ఒకప్పుడు చేపలను దిగుమతి చేసుకున్నాం.. ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాం : మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్లో 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. మత్స్యపరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
mobile fish vehicles : ఒకప్పుడు చేపలను దిగుమతి చేసుకునే వాళ్లం.. ఇప్పుడు చేపలను ఎగుమతి చేసే స్థానానికి ఎదిగామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. రానున్న రోజుల్లో చేపల పరిశ్రమకు సంబంధించిన అనేక పరిశ్రమలను తెలంగాణలో నెలకొల్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో జీహెచ్ఎంసీ, 29 జిల్లాలకు కలిపి 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మత్స్యపరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేదని… కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నీళ్లలో చేపల ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్రంలో నీలి విప్లవం అద్భుతంగా కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్లో చేపలు ఒకట్రెండు చోట్ల మాత్రమే లభించడంతో నగర ప్రజలకు చేపలు తినే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని మంచి ఆలోచన చేసి.. సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. ప్రస్తుతం 117 వాహనాలను ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు ఎంత మంచివారో అంతే రుచిగా తెలంగాణ చేపలు ఉంటాయని కొనియాడారు. సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి ఆలోచన చేశారని పేర్కొన్నారు. ఈ వాహనాలు అందుబాటులోకి రావడం వల్ల మత్స్యకారులకు ఉపాధి విరివిగా పెరుగుతుందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని భావించిన సీఎం కేసీఆర్.. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించారని తెలిపారు. మత్స్యకారులు చనిపోతే రూ. 6 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నది.. కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు.