మౌక్తిక ఆచూకీ కనిపెడతాం.. సమాచారమిస్తే రూ.25వేల రివార్డు : సీపీ
Missing Girl Mukthika : అదృశ్యమైన 15ఏళ్ల బాలిక మౌక్తిక ఆచూకీ అతి త్వరలోనే కనిపెడతామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. హయత్నగర్లోని తొర్రూరు ప్రాంతానికి చెందిన ఇంట్లో పేరంట్స్ తో గొడవ పడిన మౌక్తిక కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన సంగతి తెలిసిందే.
ఎల్బీనగర్నగర్లోని తన క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో రాచకొండ సీపీ మాట్లాడారు. తొర్రూరు గ్రామానికి చెందిన రాజేశ్, విజయలక్ష్మి కుమార్తె మౌక్తిక (15) వారం క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె ఆచూకీ లభించలేదు. చదువు విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
మౌక్తిక కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, గతంలో నివసించిన దిల్సుఖ్నగర్లోని పీఅండ్టీ కాలనీలో సీసీ ఫుటేజీలు పరిశీలించినట్టు సీపీ తెలిపారు.
ఆ సీసీ ఫుటేజీలో మౌక్తిక కనిపించిందన్నారు. ఎస్వోటీ పోలీసులతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మౌక్తిక ఆచూకీ తెలిసిన వారు డయల్ 100కి లేదా 9490617111, 9490617161 నెంబర్లకు, వాట్సాప్, నేరుగా సమాచారాన్ని అందించాలని కోరారు. బాలిక సమాచారం ఇచ్చిన వారికి రూ.25వేల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు.