బీజేపీ కార్యకర్తలు గూండాల్లాగా వ్యవహరించారు : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

  • Published By: bheemraj ,Published On : November 2, 2020 / 10:38 PM IST
బీజేపీ కార్యకర్తలు గూండాల్లాగా వ్యవహరించారు : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

BJP activists’ attack : సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ వద్ద బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే బస చేస్తున్న గదిలోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లి దాడి చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో పలువురు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.



ఎమ్మెల్యే బస చేస్తున్న హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లి దాడి చేశారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దాడిని ప్రతిఘటించారు. బీజేపీ కార్యకర్తల దాడిని టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు. పలువురు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే బీజేపీ కార్యకర్తలు మందు తాగి వచ్చి దాడికి దిగారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.



దాడిపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు గూండాల్లాగా వ్యవహరించారని పేర్కొన్నారు. మద్యం సేవించి హోటల్ గదిలోకి దూసుకొచ్చారని తెలిపారు. దాదాపు 100 మంది వచ్చి తమపై దాడికి యత్నించారని తెలిపారు.



ఉప ఎన్నికను రచ్చ చేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. ఘటనపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బీజేపీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.