Money scam: మనీ మోసం.. విద్యార్ధులే టార్గెట్.. రూ.10వేలు కడితే.. రూ.1.5 లక్షలు!
మనీ మోసాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ సాయంతో ఇటీవలికాలంలో ఈ మోసాలు ఇంకా ఎక్కువయ్యాయి.
Money scam: మనీ మోసాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ సాయంతో ఇటీవలికాలంలో ఈ మోసాలు ఇంకా ఎక్కువయ్యాయి. లేటెస్ట్గా రూ.10వేలు కడితే.. రోజుకు రూ.వేయి లెక్కన 150 రోజులకు రూ.1.5లక్షలు ఇస్తామంటూ ‘పీవీ సోలార్ అప్లికేషన్స్’ పేరిట మోసం చేశారు. ఐటీ కారిడార్ పరిధిలోని విద్యార్థులనే టార్గెట్గా చేసుకుని ఈ మోసాలకు పాల్పడ్డారు నేరగాళ్లు.
బాధితులు పదుల సంఖ్యలో ఉంటారని భావిస్తే వేలల్లో రావడంతో సైబరాబాద్ పోలీసులకే ఈ కేసు ఛాలెంజింగ్ అయ్యింది. రాయదుర్గం పోలీస్స్టేషన్లో బాధితుడి(23) ఫిర్యాదుతో నెలరోజులుగా ‘పీవీ సోలార్ అప్లికేషన్స్’ పేరిట జరిగిన మొత్తం మోసం వెలుగులోకి వచ్చింది.
‘పీవీ సోలార్ అప్లికేషన్స్’ పేరిట యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉండగా.. మొబైల్ నంబర్, అకౌంట్ వివరాలు ఇస్తే చాలు.. ఎవరైనా ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.10వేల మొదలు రూ.5 లక్షల వరకు వివిధ కేటగిరీలు ఉండగా.. యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టరై కేటగిరీని ఎంపిక చేసుకుని, ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా డబ్బులను చెల్లించే అవకాశం కల్పిస్తారు.
మొదట్లో అంతా బాగానే ఉందని, తర్వాతే అసలు రంగు బయటపడినట్లు బాధితులు చెబుతున్నారు. ఆ నోటా.. ఈ నోట తెలిసి వేల సంఖ్యలో బాధితులు పెట్టుబడులు పెట్టడంతో.. ఐటీ కారిడార్లోని ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. తీరా మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
ప్రస్తుతం యాప్ ఓపెన్ చేయగానే ఒకటి, రెండు నిమిషాల్లోనే ‘ఎర్రర్’ అని వచ్చి క్లోజ్ అయిపోతుంది. ఎవరికీ చిక్కకుండా యాప్ నిర్వాహకులు చాలా తెలివిగా వ్యవహరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితుల బ్యాంకు ఖాతాల ద్వారా వారిని గుర్తించేపనిలో పడ్డారు పోలీసులు.