కామ్‌గా వస్తారు, ఖతం చేసేస్తారు.. డబ్బులిస్తే చాలు, ఎంతకైనా తెగిస్తారు.. దడ పుట్టిస్తున్న సుపారీ కిల్లర్స్

  • Published By: naveen ,Published On : October 23, 2020 / 05:33 PM IST
కామ్‌గా వస్తారు, ఖతం చేసేస్తారు.. డబ్బులిస్తే చాలు, ఎంతకైనా తెగిస్తారు.. దడ పుట్టిస్తున్న సుపారీ కిల్లర్స్

supari killers: పక్కోడి ప్రాణాలంటే వాళ్లకు లెక్కలేదు. వాళ్లకు అందాల్సిన లెక్క అందితే.. ఎవడి ప్రాణాలైనా లెక్క చేయకుండా తీసేస్తారు. డబ్బులిస్తే చాలు.. ఎవరినైనా చంపేస్తారు. ప్రాణాలు తీయడమే వాళ్ల పని. వాళ్లే.. సుపారీ గ్యాంగ్స్. పోలీసులంటే బెదురు లేదు.. కోర్టులన్నా, శిక్షలన్నా లెక్కలేదు.. పగలు, రాత్రి తేడా లేదు.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే.. కత్తులు, తుపాకులు, ఇతర ఆయుధాలతో హత్యలకు తెగబడతారు. పక్కా ప్లాన్లు.. రెక్కీలతో ఊపిరి తీసేస్తారు.

నల్గొండ జిల్లాలో ఈ ఏడాదే(2020) రెండు సుపారీ మర్డర్‌లు:
నల్గొండ జిల్లాలో ఈ ఏడాదే(2020) రెండు సుపారీ మర్డర్‌లు జరిగాయ్. ఓ వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. అనుముల మండలం హజారీగూడెంలో నెలల వ్యవధిలోనే జరిగిన 3 హత్యలు.. అక్కడి జనం ఉలిక్కిపడేలా చేశాయ్. ఫిబ్రవరి 5న మొదటి హత్య జరగ్గా.. దానికి ప్రతీకారంగా ఆగస్ట్ 3న జంట హత్యలు జరిగాయ్. ఈ దారుణ హత్యలు.. పచ్చని పల్లెలో అలజడి రేపాయ్.

ప్రాణం తీసిన అక్రమ సంబంధం:
ఓ కుటుంబంలో ఒక్కగానొక్క కొడుకు దూరంగా కాగా.. దానికి ప్రతీకారంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనల వెనక లక్షల రూపాయలు చేతులు మారింది. మొదటి హత్య ఘటనలో.. సుపారీ తీసుకున్న వారికి ఎలాంటి నేరచరిత్ర లేనప్పటికీ.. ఆర్థిక అవసరాలే వారిని ఆ దిశగా వెళ్లేలా చేశాయి. ఇక రెండో ఘటనలో.. కరడుగట్టిన సుపారీ గ్యాంగ్ 15 లక్షలకు ఒప్పందం చేసుకొని.. ఇద్దరు వ్యక్తులను హతమార్చింది.

ఏడు నెలల్లోనే కొడుకు హత్యకు తల్లి ప్రతీకారం, రూ.15లక్షల సుపారీ ఇచ్చి ఇద్దరి హత్య:
నల్గొండ జిల్లా అనుముల మండలం నాయుడుపాలెంకు చెందిన రేవంత్.. హాజారిగూడెంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై.. ఆ మహిళ భర్త అతడిని ఎన్నిసార్లు మందలించినా మార్పురాలేదు. దీంతో.. స్థానికులకే లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి రేవంత్‌ను హత్య చేయించాడు భర్త. తన కొడుకు హత్యతో.. రేవంత్ తల్లి తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. కొడుకు హత్య జరిగిన ఏడు నెలల్లోనే.. ఆ తల్లి ప్రతీకారం తీర్చుకుంది. తన కొడుకు హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇద్దరు సోదరులను.. 15 లక్షల సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించింది. ఈ సుపారీ గ్యాంగ్.. నల్గొండ జిల్లాకు చెందినదే. ఈ దారుణ హత్యలతో.. అప్పట్లో నల్గొండ జిల్లాలో కలకలం రేగింది.

సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య:
2018 సెప్టెంబర్‌‌‌‌ 14న మిర్యాలగూడ ప్రణయ్‌ని కూడా సుపారీ గ్యాంగే హతమార్చింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ప్రణయ్‌ని చంపేందుకు అమృత తండ్రి మారుతీరావు.. లోకల్ రౌడీషీటర్‌ కమ్ పొలిటీషియన్ అయిన కరీంను సంప్రదించాడు. కరీం ఉగ్రవాద మూలాలున్న మహ్మద్ బారీ, అస్గర్ అలీని కాంటాక్ట్ అయ్యాడు. వీళ్లిద్దరూ.. తమకు జైల్లో పరిచయం అయిన బిహార్ కిరాయి హంతకుడు సుభాష్ శర్మతో పాటు మరో ఇద్దరిని మిర్యాలగూడకు రప్పించారు.

ప్రణయ్ హత్యకు రూ.కోటి సుపారీ:
మారుతీరావు, ఆయన తమ్ముడు శ్రవణ్, సుభాష్ శర్మ, అస్గర్ అలీ, మహ్మద్ బారీ, కరీం, శివ, నిజాంతో కలిసి.. ప్రణయ్ హత్యకు స్కెచ్ గీశారు. బిహార్ గ్యాంగ్‌కు.. కోటి రూపాయలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అడ్వాన్స్‌గా.. 20 లక్షలు ఇచ్చేశారు. తర్వాత.. హైదరాబాద్, మిర్యాలగూడలో 2 నెలల పాటు ప్రణయ్ ని చంపేందుకు సుభాష్ రెక్కీ చేశారు. అమృతకు హాని జరగకుండా ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే.. ప్రణయ్‌ని కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో.. మారుతీరావు, అతని తమ్ముడు శ్రవణ్, బిహార్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సుపారీ గ్యాంగ్‌కు ఐఎస్‌ఐ ఉగ్రవాదులతో లింకు:
నల్లగొండ జిల్లాలోనూ సుపారీ గ్యాంగ్‌ హత్యలు చేసింది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లోనే కలకలం రేపింది. తన కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని అల్లుడిని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించాడు మారుతీరావు. ఈ సుపారీ గ్యాంగ్‌కు ఐఎస్‌ఐ ఉగ్రవాదులతో లింకు ఉండటం మరింత కలవరపాటుకు గురి చేసింది.