Nagarjuna Sagar by-poll : నాగార్జున సాగర్ గెలుపు కోసం పార్టీల కసరత్తులు..సీనియర్ మోస్ట్గా బరిలోకి దిగిన జానారెడ్డి
నాగార్జున సాగర్ బై పోల్.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడదే హాట్ టాపిక్. రాజకీయాల్లో తలపండిన నేతతో ఇద్దరు యువకులు తలపడుతున్నారు.
Nagarjuna Sagar by-poll is a hot topic : నాగార్జున సాగర్ బై పోల్.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడదే హాట్ టాపిక్. రాజకీయాల్లో తలపండిన నేతతో ఇద్దరు యువకులు తలపడుతున్నారు. నామినేషన్ కూడా ముగియడంతో.. ఇక నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. సాగర్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని నిలిబెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
చివరి రోజున నామినేషన్ దాఖలు చేసిన నోముల భగత్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు పార్టీ ముఖ్యనేతలంతా సాగర్కు క్యూ కట్టారు. అటు తండ్రి సెంటిమెంట్నే నమ్ముకున్న భగత్… బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా తన వెంటే ఉంటుందని భావిస్తున్నారు. అయితే రాజకీయ అనుభవం లేకపోవడం, స్థానికుడు కాదనే వాదన ప్రతికూలతలుగా మారుతున్నాయి.
ఊహించని విధంగా బీజేపీ బీఫాం పొందిన రవికుమార్ నాయక్.. సాగర్లో కాషాయం జెండా ఎగరవేయాలని తహతహలాడుతున్నారు. దుబ్బాక జోష్ ఇక్కడా కంటిన్యూ అవుతోందని నమ్ముతున్నారు. బీజేపీకి సాగర్లో సంస్థాగత బలం లోకపోవడం… రాజకీయాల్లో రవికుమార్ కొత్ కావడం కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సీటు ఆశించి భంగపడ్డ సీనియర్లు.. ఆల్రెడీ నామినేషన్ వేసిన నివేదిత ఏమేరకు సహకరిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు… బీజేపీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్య టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.
కంచు కోటను తిరిగి దక్కించుకుని.. పార్టీ పునర్వైభవానికి బాటలు వేయాలని జానారెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఇద్దరూ జూనియర్లే కావటం… సుదీర్ఘ రాజకీయ అనుభవం, నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కిందిస్థాయి నేతలను ప్రభావితం చేయగలిగే సత్తా సాగర్లో గెలిపిస్తుందని జానారెడ్డి భావిస్తున్నారు.
టికెట్ల కేటాయింపుతో కమలం పార్టీలో గుబులు రేగింది. ముఖ్య నేతలు ఇప్పటికే సైలెంట్ అవడంతో… ఆ పార్టీకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇక తనకివే చివరి ఎన్నికలంటూ ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు సీనియర్ నేత జానారెడ్డి. అటు అధికార పార్టీ అండతో బరిలోకి దిగుతున్న భగత్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్రిముఖ పోటీతో సాగర్ బై ఎలక్షన్ హాట్ హాట్గా మారింది.