హైదరాబాద్‌లో మళ్లీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్, నాచారంలో ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి రూ.10 లక్షల నగదు, 20 తులాల గోల్డ్ తో పరార్

  • Published By: naveen ,Published On : October 20, 2020 / 11:36 AM IST
హైదరాబాద్‌లో మళ్లీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్, నాచారంలో ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి రూ.10 లక్షల నగదు, 20 తులాల గోల్డ్ తో పరార్

nepali gang: పని కావాలంటూ వస్తారు.. సైలెంట్‌గా వాళ్ల పని చేసుకొని పోతారు. ఇది నేపాలీ గ్యాంగ్‌ చోరీ ఫార్ములా.. నేపాల్‌ నుంచి వచ్చిన ఈ గ్యాంగ్‌ హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతోంది. నెల రోజుల వ్యవధిలో రెండు చోట్ల భారీ మొత్తంలో దోచుకెళ్లిందీ ముఠా. ఇంట్లో పనిమనుషులుగా చేరి.. వాళ్ల పని కానిచ్చేస్తున్నారు ముఠా సభ్యులు. ఇటీవల హైదరాబాద్‌ రాయదుర్గంలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన చోరీ ఘటన మరువక ముందే నాచారంలో మళ్లీ రెచ్చిపోయారు ముఠా సభ్యులు. ఇంటి యజమానులకు మత్తు మందు ఇచ్చి ఇళ్లు లూటీ చేశారు. 10 లక్షల నగదు, 20 తులాల బంగారంతో ఉడాయించారు.

10 రోజుల క్రితమే పనిలోకి వచ్చిన భార్యాభర్తలు:
మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో 10 రోజుల క్రితమే పనికి దిగారు భార్యాభర్తలు. యజమానులకు నమ్మకంగా ఉన్నట్లు నటించారు. ఇంట్లో వారంతా శుభకార్యానికి వెళ్లగా తమ ప్లాన్‌ను అమలు చేశారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలికి తినే ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆమె నిద్రలోకి జారుకోగానే ఇంట్లో ఉన్న బంగారం, నగదు మొత్తం సర్దేసి రాత్రికి రాత్రి అక్కడి నుంచి పరారయ్యారు.

తిరిగి ఇంటికి వచ్చిన యజమానులు విషయం తెలియడంతో షాక్‌కి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపిన పోలీసులు.. ఇంటి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే నెల రోజుల వ్యవధిలో నేపాలీ గ్యాంగ్‌ రెండు చోట్ల చోరీకి పాల్పడటం కలకలం రేపుతోంది.
https://10tv.in/big-twist-kukatpally-young-girl-gang-rape-incident/
రాయదుర్గంలో ఓ వ్యాపారవేత్త ఇంట్లోనూ చోరీ:
రాయదుర్గంలోనూ వరుస చోరీలకు పాల్పడిందీ ఇదే నేపాలీ గ్యాంగ్‌. ప్లాన్‌ ప్రకారం ఓ వ్యాపారవేత్త ఇంట్లో పనిమనిషిగా ఇంట్లో చేరిన గ్యాంగ్‌ సభ్యులు యజమానులను నమ్మించి వారు తినే ఆహారంలో మత్తుమందు కలిపారు. వారు మత్తులోకి జారుకున్నాక.. ఇంట్లో ఉండే బంగారం, నగదుతో అక్కడి నుంచి చెక్కేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. రాయదుర్గంలోని ఇంట్లో చోరీ చేసిన గ్యాంగ్‌లో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నేపాల్ నుంచి యూపీ బోర్డర్ మీదుగా భారత్ లోకి ఎంట్రీ, నేపాల్ పని మనుషులతో జాగ్రత్త:
ఈ గ్యాంగ్‌కు నేపాల్‌లో ఓ లీడర్‌ ఉన్నాడు. అతడి ఆదేశాలతోనే వీళ్లంతా హైదరాబాద్‌, బెంగళూరు లాంటి సిటీ ప్రాంతాల్లోకి ఎంటరై సైలెంట్‌గా వాళ్ల పని కానిస్తున్నారు. నేపాల్‌ నుంచి యూపీ బోర్డర్‌ మీదుగా భారత్‌లోకి ఎంటరవుతున్నారు. అక్కడి నుంచే మత్తుమందు కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. నేపాలీ గ్యాంగ్‌ కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయిన సైబరాబాద్‌ పోలీసులు వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నేపాలీ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. వివరాలన్నీ తెలుసుకున్నాకే వారిని పనికి కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు.