దుబ్బాకలో పక్కా ప్లాన్‌తో కదన రంగంలోకి దిగింది, గట్టి అభ్యర్థినే నిలబెట్టింది.. అయినా ఆ పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది

  • Published By: naveen ,Published On : October 23, 2020 / 01:29 PM IST
దుబ్బాకలో పక్కా ప్లాన్‌తో కదన రంగంలోకి దిగింది, గట్టి అభ్యర్థినే నిలబెట్టింది.. అయినా ఆ పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది

congress: అన్ని ప్లాన్స్‌ పక్కాగా వేసుకున్నారు.. లోకల్‌గా పట్టున్న అభ్యర్థిని పట్టుకొచ్చి నిలబెట్టారు. ప్రతి గ్రామానికి ఇన్‌చార్జిలను నియమించారు. స్టేట్‌ లెవెల్‌ లీడర్లందరినీ అక్కడే మోహరించేశారు. ఇంకేం.. గ్యారెంటీగా మంచి రిజల్ట్‌ వచ్చేస్తుందని లెక్కలేసుకోవడం మొదలుపెట్టేశారు. కానీ, దిగితేనే కదా లోతు తెలిసేది.. ఇప్పుడో కొత్త సమస్య ఆ పార్టీ నేతలను పట్టి పీడిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏది? సమస్య ఏంటి?

పక్కా ప్లాన్ తోనే కదన రంగంలోకి దిగింది, అయినా ఎక్కడో తేడా కొడుతోంది:
దుబ్బాక ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. కదన రంగంలోకి పక్కా ప్లాన్‌తోనే దిగింది. అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల ఇన్‌చార్జ్‌ల వరకు వ్యూహాత్మకంగానే అడుగులు వేసింది. పార్టీ అభ్యర్థిగా దివంగత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిని బరిలో నిలబెట్టింది. నియోజకవర్గంలో చెరుకు కుటుంబానికి మంచి పేరు ఉండటంతో ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవచ్చని భావించింది.

అంతేగాక గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రచారం కోసం దుబ్బాకలో దించింది. ప్రతీ గ్రామానికి ఒక నేతను ఇన్‌చార్జ్‌గా, మండలానికి నలుగురు సీనియర్ నేతలను సమన్వయం చేసుకునేందుకు నియమించింది. కానీ, ఎక్కడో తేడా కొడుతోందనే టాక్‌ వినిపిస్తోంది.

ఎన్నికల ప్రచారం చేసేందుకు వెళ్లిన నేతలకు సినిమా కష్టాలు:
ఇంతవరకు కాంగ్రెస్‌ వ్యూహాలన్నీ బాగానే ఉన్నా.. అసలు సినిమా ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. క్షేత్రస్థాయిలోకి దిగిన తర్వాత అసలు తత్వం బోధపడిందని చెబుతున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీని మొత్తంగా ముందుకు నడిపించేందుకు ఒక నాయకత్వం అంటూ లేకపోవడంతో కేడర్ అంతా చెల్లా చెదురైపోతోందని అంటున్నారు. ఎన్నికల ప్రచారం చేసేందుకు వెళ్లిన నేతలకు సినిమా కష్టాలు ఎదురవుతున్నాయట.

మూడు పోలింగ్ బూత్‌లు ఉంటే.. అతికష్టం మీద ఒకరిద్దరు మాత్రమే ఏజెంట్లు దొరికారు:
గ్రామాలకు ఇన్‌చార్జిగా వెళ్లిన వారికి స్థానికంగా మద్దతు లభించక ఇబ్బందులు పడుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్‌చార్జ్‌గా ఉన్న ఒక నేత గాంధీ భవన్‌కు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆ నేతకు మిర్ దొడ్డి మండలంలో ఇన్‌చార్జిగా అప్పగించిన గ్రామానికి వెళ్తే.. అక్కడ ఎదురైన పరిస్థితికి అవాక్కయ్యారట. ఏం చేయాలో అర్థం కాక గాంధీ భవన్‌కు వచ్చి తన బాధనంతా వెళ్లగక్కారని చెబుతున్నారు. ఆ గ్రామంలో మూడు పోలింగ్ బూత్‌లు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి అతి కష్టం మీద ఒకరిద్దరు మాత్రమే ఏజెంట్లు దొరికారని టాక్‌.

పోలింగ్ నాటికి ఏజెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన:
ప్రచారం సమయంలోనే ఇలాంటి పరిస్థితులుంటే.. పోలింగ్ నాటికి ఏజెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించడానికే కష్టంగా ఉందంటున్నారట. ఇదంతా ఒక ఎత్తైతే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ ఒత్తిడి నేతలపై మరింతగా ఉందని అంటున్నారు. ఠాగూర్ వరుసగా సమీక్షలు పెట్టడం.. ఇన్‌చార్జులే ఖర్చు పెట్టాలని టార్గెట్లు విధిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని గగ్గోలు పెడుతున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఆయన ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో? పార్టీని ఎలా గాడిలో పెడతారో చూడాల్సిందే.