నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం నేడే..సంబరాలకు టీఆర్ఎస్ కేడర్ రెడీ!

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 05:59 AM IST
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం నేడే..సంబరాలకు టీఆర్ఎస్ కేడర్ రెడీ!

Nizamabad MLC By poll : మరికొన్ని గంటల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. రెండు గంటల్లో ఫలితం వెలువడనుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రెండు రౌండ్లలో కౌంటింగ్ పక్రియ పూర్తి చేయనున్నారు.



తొలి రౌండ్‌లోనే ఫలితం వెల్లడికానుంది. లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది. ఇక మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్ల వస్తేనే డిపాజిట్ దక్కనుంది. కౌంటింగ్‌కు ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్ కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కిస్తారు.



ఆ తర్వాత బ్యాలెట్‌ ద్వారా పోలైన ఓట్లను ఒక్కచోట కుప్పగా పోసి.. 25 ఓట్లకు ఓ కట్టగా కట్టి లెక్కిస్తారు. ప్రాధాన్య పద్దతి ఓటింగ్ లో మొదటి ప్రాధాన్యత, ఓట్లు ఎన్ని వచ్చాయో చూస్తారు. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రిటర్నింగ్‌ అధికారి ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 824 ఓట్లు ఉండగా… 821 మంది ఓటు వేశారు.



ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. 99.87 శాతం పోలింగ్ నమోదైంది. ఇక కౌంటింగ్‌కు ఒక్కో పార్టీ నుంచి 8 మందిని మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. TRS తరపున మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ తరపున సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీపడ్డారు. అయితే పోలింగ్ ఏకపక్షంగా జరగడంతో ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనంగా మారడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలకు రెడీ అవుతున్నాయి.