కరోనాతో తమాషాలు వద్దు : తెలంగాణలో పెరుగుతున్న కేసులు

  • Published By: madhu ,Published On : March 21, 2020 / 12:50 AM IST
కరోనాతో తమాషాలు వద్దు : తెలంగాణలో పెరుగుతున్న కేసులు

కరోనాను ఆషామాషీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చని సూచించింది.

లండన్ నుంచి వచ్చిన యువతికి : – 
ఎందుకంటే..రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా లండన్‌ నుంచి వచ్చిన 18 ఏళ్ల హైదరాబాద్‌ యువతి కరోనా బారిన పడింది. ప్రస్తుతం బాధితురాలు చెస్ట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇండోనేషియా బాధితుల్లో 27 ఏళ్ల యువకుడు, 60ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో మొత్తంగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. 

11 మంది విదేశీయులు..8 మంది భారతీయులు : – 
వీరిలో మొదటి కేసు యువకుడు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.  మిగిలిన 18 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఉన్న కరోనా బాధితుల్లో 11 మంది విదేశీయులు ఉన్నారు. మిగిలిన 8 మంది భారతీయులు. వారు కూడా విదేశాలకు వెళ్లి వచ్చిన వారే. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రజలు కూడా సమాయత్తం కావాలని సూచించారు.

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : – 
కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో వైద్యారోగ్యశాఖ అధికారులు,  ఐఎంఏతోపాటు వైద్య సంఘాల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  కరోనా నియంత్రణ చర్యలను కేంద్రం ప్రశంసించిందని చెప్పారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారికే వైరస్‌ సోకిందని, రాష్ట్ర ప్రజలెవరికీ సోకలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే విద్యాసంస్థలు, బార్లు, జిమ్‌లు, పార్క్‌లు, థియేటర్లు మూతపడ్డాయి. హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

జనతా కర్ఫ్యూ పాటించాలన్న గవర్నర్ : – 
ప్రధాని మోదీ పిలుపుమేరకు 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ప్రజలంతా జనతా కర్ఫ్యూను పాటించాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కోరారు. కరోనా వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకారం అందించాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, సామాజిక బాధ్యతతో మనిషికి, మనిషికి మధ్య దూరం పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో, సహనంతో వ్యవహరించి కంటికి కనిపించని మహమ్మారి వైరస్‌ను తరిమికొట్టడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

Read More : ఛీటింగ్ : MBS jewellers అధినేత ఎక్కడ