ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్లు నిలిపివేత
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోండగా.. రోజుకు 3 లక్షలకు మించి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పరిస్థితి చేయిదాటి పోతున్నట్లుగా అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే బ్లాక్ మార్కెట్ల దందా ఆందోళన కలిగిస్తుండగా.. కరోనా కట్టడికి ఏకైక ఆయుధంగా భావిస్తోన్న వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది కేంద్రం.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తొలి రెండు దశల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్, 45 ఏళ్ల పైబడిన వారికి వాక్సిన్ ఇచ్చిన ప్రభుత్వం.. మే 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ నిలిపివేయాలని రాష్ట్రంలోని డీఎంహెచ్వోలకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ ఆదేశించారు.
అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకోవాలని ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. మిగిలిన వ్యాక్సిన్లను మాత్రం తిరిగి సేకరించాలని సీసీపీ వైద్యాధికారులు, ఫార్మసిస్ట్లను డీహెచ్ ఆదేశించారు.