Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్
హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్లో ఉన్న స్థలాలను ఐటీ సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆఫీస్ బబుల్స్ పేరుతో ఐటీ కంపెనీలకు స్థలాలను కేటాయించి, అద్దెలు వసూలు చేయాలని ప్రతిపాదించింది. మెట్రో స్టేషన్లలో ఆఫీసులు, మాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
Hyderabad Metro Rail Stations : హైదరాబాద్ మెట్రో రైల్ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. వివిధ రూపాయల్లో వస్తున్న ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసి ఫలితం లేదు. దీంతో సొంత ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. మెట్రోకు వచ్చే మొత్తం ఆదాయంలో టికెట్ల ద్వారా 50శాతం.. ప్రకటనల ద్వారా 5శాతం, రియల్ ఎస్టేట్, వ్యాపార కేంద్రాల ద్వారా 45 శాతం రావాల్సి ఉంది. కానీ లక్ష్యాలకు ఆమడదూరంలో నడుస్తోంది. ప్రయాణికులతో పాటు ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవడంలో పెద్దగా ఫలితాలు కనిపించలేదు. దీంతో రియల్ ఎస్టేట్ ఆదాయంపై దృష్టి పెట్టింది.
హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్లో ఉన్న స్థలాలను ఐటీ సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆఫీస్ బబుల్స్ పేరుతో ఐటీ కంపెనీలకు స్థలాలను కేటాయించి, అద్దెలు వసూలు చేయాలని ప్రతిపాదించింది. మెట్రో స్టేషన్లలో ఆఫీసులు, మాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఐటీ కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్లగ్ అండ్ ప్లే, బేర్ షెల్, వార్మ్ షెల్ రూపంలో స్థలాలను కేటాయించనుంది. రిటైల్ దుకాణాల కోసం ప్రతి స్టేషన్లో స్థలాలు వదిలినప్పటికీ అంతగా స్పందన లేకపోవడంతో ప్రధాన స్టేషన్లలో కో వర్కింగ్ స్పేస్లుగా మార్పులుగా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
Strong Security: భద్రతా వలయంలో మోదీ పర్యటించే ఏరియాలు.. మెట్రో సేవలు బంద్..
రవాణా ఆధారిత కార్యాలయ ప్రాంగణంగా ఆఫీస్ బబుల్స్ను అందుబాటులోకి తీసుకురావడంత భారతీయ మెట్రో రైలు చరిత్రలోనే మొదటిసారి. మూడు కారిడార్లలోని 57 మెట్రో స్టేషన్లలో 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అద్దెకు ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. 49 స్టేషన్లలో ప్రతిచోటా రెండు యూనిట్లలో వెయ్యి 750 చదరపు అడుగుల ప్రాంగణం అందుబాటులో ఉంది. అమీర్పేట, ఎంజీబీఎస్, మియాపూర్, నాగోల్, జేబీఎస్, పంజాగుట్ట వంటి పెద్ద స్టేషన్లలో 5వేల నుంచి 30వేల చదరపు అడుగుల స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
నగరంలో వృద్ధి చెందుతున్న కోవర్కింగ్ ప్రాంగణాల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థ ఈ విధానానికి ప్లాన్ చేసింది. పౌర సేవలు అందించే సంస్థలకు సైతం అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తోంది. మలక్పేట స్టేషన్లో నగరంలోనే అతిపెద్ద ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటైంది. మెట్రోరైలు స్టేషన్లలో కార్యాలయాల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా మెట్రోలోనే వచ్చి.. ఆఫీస్లో పని పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లే విధంగా ఆఫీస్ బబుల్స్కు ప్లాన్ చేసింది.