లాక్ డౌన్ వేళ విషాదం : హైదరాబాద్ లో ఆకలితో వృద్ధుడు మృతి
భారతదేశం లాక్ డౌన్ అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా (నిత్యావస సరకులు, అత్యవసరం మినహా) నిలిచిపోయాయి. వలస వెళ్లిన కూలీలు, అభాగ్యులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పలు స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి అభాగ్యుల ఆకలిని తీరుస్తున్నారు. కానీ ఓ వృద్ధుడు ఆకలతో అలమటించి చనిపోయడు. ఈ విషాద ఘటన ఎక్కడో మారుమూల గ్రామంలో జరగలేదు. హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
హుమాయిన్ నగర్ లో 60 సంవత్సరాలున్న ఓ వృద్ధుడు ఫుట్ పాత్ పై పడి ఉన్నాడు. 2020, మార్చి 30వ తేదీ సోమవారం ఉదయం ఈ ప్రాంతం గుండా..పోలీసులు వెళుతున్నారు. సార్..ఆకలిగా ఉందని చెప్పాడు. చలించిపోయిన పోలీసులు..పండ్లు తీసుకరావడానికి వెళ్లారు. తిరిగి ఆ వృద్ధుడి వద్దకు వచ్చారు. ఎంత లేపినా లేవలేదు.
ఆకలి తీరకుండానే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చివరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలిచివేసింది. ఇతను గతకొన్ని రోజులుగా ఫుట్ పాత్ పైనే ఉంటున్నాడని, ఆకలితో అలమటిస్తున్నాడని సమాచారం. ఇతను ఎక్కడి వాడు ? ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది. (కరోనాతో ప్రముఖ సింగర్ మృతి)
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా విరాళాలు అందుతున్నాయి. సినీ, రాజకీయ క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, ఇతరులు తమకు తోచిన విధంగా సహాయం అందచేస్తున్నారు.