నాగర్ కర్నూలు జిల్లాలో కరోనాతో ఒకరి మృతి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. శనివారం (జూన్ 6, 2020) నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మృతి చెందాడు. బిజినేపల్లి మండలం ఖానాపూర్లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా అల్లీపూర్లో హోంగార్డుతోపాటు జిల్లా కేంద్రానికి చెందిన మరో మహిళకు కూడా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలో కేసుల సంఖ్య 13కు చేరింది. వృద్ధుడి మృతితో మర్రిపల్లిలో నాగర్కర్నూల్ ఎస్పీ సాయిశేఖర్, డీఎంహెచ్వో సుధాకర్లాల్ పర్యటించారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల మండ లం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు కలెక్టర్ శ్రీధర్ శనివారం ప్రకటించారు. హైదరాబా ద్లోని కాటేదాన్లో పనిచేస్తున్న సదరు వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఇటీవల సొంత గ్రామానికి రాగా, డయాబెటిస్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నందున వారం కిందట హైదరాబాద్కు చికిత్స నిమిత్తం వెళ్లాడని, అక్కడే కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతూ మరణించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఇతనికి సంబంధించి ఇప్పటి వరకు ఏడుగురు ప్రైమరీ కాంటాక్ట్స్ను గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. కాగా, మర్రిపల్లి గ్రామాన్ని ఎస్పీ సాయిశేఖర్, డీఎంహెచ్వో సుధాకర్లాల్ సందర్శించారు. నెల కిందట జరిగిన సదరు వృద్ధుడి తల్లి అంత్యక్రియల్లో, దశ దినకర్మలో పాల్గొన్న వారి వివరాలు సేకరించాలని ఎస్సై రమేశ్కు సూచించారు. అలాగే వారం రోజుల కిందట ఉప్పునుంతలలో మృతి చెందిన చిన్నారి కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గద్వాల జిల్లాలో పనిచేస్తున్న మహబూబ్నగర్ మండలంలోని అల్లీపూర్ గ్రా మానికి చెందిన హోంగార్డుకు కరోనా లక్షణా లు ఉండడంతో శాంపిల్స్ను శుక్రవారం హైదరాబాద్కు పంపించారు. శనివారం పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు వచ్చిందని డీఎంహెచ్వో కృష్ణ చెప్పారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ బంగ్లా సమీపంలోని న్యూగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఎనిమిది నెలలుగా క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్లో చికిత్స పొందుతోంది.
ఈ క్రమంలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు డీఎంహెచ్వో తెలిపారు. బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని తాడిపర్తిలో విద్యుదాఘాతానికి గురికాగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు.