ఉన్న చోటే రేషన్.. తెలంగాణలో ఉచితంగా సరుకులు

  • Published By: madhu ,Published On : August 12, 2020 / 07:51 AM IST
ఉన్న చోటే రేషన్.. తెలంగాణలో ఉచితంగా సరుకులు

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉచితంగానే రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. మరింత పకడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీ రాష్ట్రానికి చెందిన (అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా) జిల్లాలకు చెందిన వందమందికి పైగా తెలంగాణలోని వివిధ రేషన్ షాపుల్లో మంగళవారం ఈ పాస్ మిషన్ లో వేలి ముద్రలు వేసి బియ్యంతో పాటు కందిపప్పు తీసుకున్నారు.

తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీలో భాగంగా మంగళవారానికి దాదాపు 1.12 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి.
వలస కూలీలు ఎక్కడున్నా..అక్కడ రేషన్ షాపుల్లో తమ రేషన్ ను పొందేందుకు ఈ విధానం వీలు కల్పిస్తుంది.

ఉపాధి కోసం పేదలు వివిధ రాష్ట్రాలకు వెళుతుంటారనే సంగతి తెలిసిందే. కానీ వీరికి రేషన్ సరుకుల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ‘వన్ రేషన్..వన్ రేషన్ కార్డు’ పథకం ద్వారా..అంతర్ రాష్ట్ర రేషన్ కార్డు పోర్టబిలిటీ విధానాన్ని దేశ వ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి తీసుకరావాలని కేంద్రం భావిస్తోంది.

అందులో భాగంగా..ఏపీకి చెందిన వారు తెలంగాణలో నివాసం ఉంటున్నారని, వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఉచిత సరుకులు అందాలనే ఉద్దేశ్యంతో అంతర్ రాష్ట్ర పోర్టబిలిటీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల నుంచి పకడ్బందిగా అమలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించాయి.