ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు…ఒక్క సెల్ఫీ చాలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 11, 2019 / 02:27 AM IST
ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు…ఒక్క సెల్ఫీ చాలు

కేవలం ఒక్క సెల్ఫీతో ఈ సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి. మీరు ఇంట్లోనే ఉండి ఒక్క సెల్ఫీ తీసి పంపిస్తే చాలు.. మీకు రావాల్సిన ప్రయోజనాలు నేరుగా అందుకోవచ్చు. ఇప్పటివరకు  పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే..మీరు బతికే ఉన్నారంటూ సర్టిఫికెట్‌ తీసుకుని రండి. అప్పుడు మీ దరఖాస్తు పరిశీలిస్తాం అంటూ పింఛనుదారులు లేదా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చాలా సందర్భాల్లో  ఎదురైన అనుభవం. కళ్ల ముందే మనిషి కనిపిస్తున్నా.. మీరు బతికే ఉన్నారని, ఫలానా వ్యక్తి మీరే అని కాగితాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. 

ఆధునిక సాంకేతికత వినియోగంలో దూసుకెళ్తున్న తెలంగాణలో దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI), మెషీన్‌ లెర్నింగ్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సమ్మిళితం చేసి ఓ యాప్‌ ను డెవలప్ చేశారు. మూడు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి దానిని మొబైల్‌ యాప్‌తో అనుసంధానించడం ద్వారా ఈ వినూత్న సాంకేతికతకు రూపునిచ్చారు. ఇప్పటివరకు దేశంలో రెండు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి ఫలితాలు సాధించగా.. మన దగ్గర మూడురకాల సాంకేతికతలను ఉపయోగించేలా సిద్ధం చేసిన యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌  రూపొందించింది. ఒక్క సెల్ఫీతోనే దీని కచ్చితత్వం ప్రస్ఫుటమవుతుంది. ఈ మొబైల్‌ అప్లికేషన్‌ ను టీ యాప్‌ ఫోలియోలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం దీనిని కొంత మేరకు ట్రెజరీ విభాగంలో రిటైరైన ఉద్యోగుల పెన్షన్‌ పంపిణీ కోసం వినియోగిస్తున్నారు. రెండు మూడు నెలల్లో దీనిని ఈ విభాగంలో మరింతగా విస్తరించనున్నారు. ఈ కొత్త యాప్‌ను ఆసరా పింఛన్ల విషయంలోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛనుతో సహా ఆసరా పింఛనుదారులు, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లబ్దిదారులు జీవించి ఉన్నారా లేదా నిజమైన లబ్దిదారులకే ఇవి అందుతున్నాయా అని కచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఈ మొబైల్‌ యాప్‌ ఉపయోగపడనుంది. అలాగే లెర్నింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్, ఇతర సర్వీసుల కోసం రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి దగ్గర నుంచే సెల్ఫీ తీసుకుని ఆయా సేవలను పొందే వెసులుబాటు కలగనుంది. లబ్దిదారుడిని సెల్ఫీ తీయడం ద్వారా లైవ్‌ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్‌ వివరాలతో డేటాబేస్‌లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫోటోతో మ్యాచ్‌ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి. సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అన్న అథెంటికేషన్‌ వస్తుంది. ఇందులో మొదటిది ఓకే కాకపోతే రెండో అంశానికి వెళ్లే అవకాశముండదు. మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది.