PM Narendra Modi: తెలంగాణ (Telangana) లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంకు సన్నద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత సీఎం కేసీఆర్ (CM KCR) ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరానికి సై అన్నారు. మరోవైపు బీజేపీ (BJP), కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధిష్టానాలు నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఆ రెండు పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. పాలమూరు వేదికగా ఎన్నికల శంఖారావ సభతో రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టనున్నారు.
పాలమూరులో బహిరంగ సభ..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లు తెలిసింది. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు పురపాలికలోని ఐటీఐ మైదానం (అమిస్తాపూర్)లో మధ్యాహ్నం 1గంటకు జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గోనున్నారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు దాదాపు 1.50లక్షల మందిని తరలించేలా బీజేపీ నేతలు కసరత్తు మొదలు పెట్టారు. మరోవైపు పాలమూరు పర్యటన తరువాత తిరిగి 3వ తేదీన మరోసారి మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నట్లు తెలిసింది. అక్టోబర్ 3న నిజామాబాద్ లో మోదీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. అయితే, అక్కడ బహిరంగ సభ ఉంటుందా, కేవలం రోడ్ షో మాత్రమే ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రాలేదు.
అగ్రనేతల వరుస పర్యటనలు ..
వచ్చేనెల 10వ తేదీలోగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అప్పటిలోగా తెలంగాణలో ప్రధాని మోదీతో పాటు పలువురు అగ్రనేతలు పర్యటనలు ఉండేలా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలతోపాటు పలువురు జాతీయ స్థాయి నేతలను రాష్ట్రానికి రప్పించి బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పది ఉమ్మడి నియోజకవర్గాల్లో, 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అగ్రనేతల సభలు ఉండేలా బీజేపీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.