దుబ్బాక ఉపఎన్నిక.. పలు చోట్ల నిలిచిన పోలింగ్, ఓటర్ల అసహనం

  • Published By: naveen ,Published On : November 3, 2020 / 11:09 AM IST
దుబ్బాక ఉపఎన్నిక.. పలు చోట్ల నిలిచిన పోలింగ్, ఓటర్ల అసహనం

polling stopped in dubbaka: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. కాగా, కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోవడం, ఆలస్యంగా ప్రారంభం కావడం వంటివి జరిగాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లిలో ఈవీఎం మొరాయించింది. దీంతో 45 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు మరో ఈవీఎంని ఏర్పాటు చేశారు. పోలింగ్ ఆలస్యం కావడంతో ఓటర్లు బారులు తీరారు.

అటు దుబ్బాక సెక్టార్ రాయపూర్ లో ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు. బూత్ నెం 94, 195లలో ఈవీఎంలు మొరాయించాయి. ఒక్కో ఓటుకు చాలా సమయం పడుతోందని ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే వచ్చినా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.

బయటపడ్డ ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం:
దుబ్బాక బై పోల్ లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఓటర్ లిస్టు తప్పుల తడకగా ఉంది. ఓటర్ లిస్టులో ఫొటో ఒకరిది ఉంటే, పేరు మరొకరిది ఉంది. ఓటర్ లిస్టులో తప్పుల కారణంగా లక్ష్మీప్రియ అనే మహిళ ఓటు వేయలేకపోయారు. దీంతో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అధికారులు తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

బరిలో 23మంది అభ్యర్థులు, నవంబర్ 10న కౌంటింగ్:
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ కొనసాగుతోంది. 23 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9గంటల వరకు 12.74 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. దుబ్బాక మండలం బొప్పాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ:
315 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ఉన్నతాధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం సాగించారు. సవాళ్లు, విమర్శలతో రాజకీయ వేడి పెంచారు. కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ కేడర్‌ సాయంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎవరు గెలుస్తారు? ఎంత ఆధిక్యం వస్తుందనే అంశమై అంతటా చర్చలు నడుస్తున్నాయి.