Kumbh Mela : కుంభమేళాకు వెళ్లొచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరి

కుంభేమేళాకు వెళ్లి వచ్చిన వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరి చేసింది.

Kumbh Mela : కుంభమేళాకు వెళ్లొచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరి

Quarantine Is A Must For Those Who Go To Kumbh Mela

Quarantine is a must for those who go to Kumbh Mela : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో మహా కుంభమేళాలో స్నానాలు చేసిన వారిలో అనేక మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో గంగానది పుణ్య స్నానాలు ప్రజల పాలిట పాపాలుగా మారుతున్నాయి. కుంభమేళాలో రోజూ లక్షల సంఖ్యలో భక్తులు గంగా స్నానం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వెళ్లారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పలువురు కుంభమేళాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కుంభేమేళాకు వెళ్లి వచ్చిన వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి ప్రభుత్వం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు డీహెచ్‌ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా 14 రోజులపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంట్లోనూ మాస్క్‌ ధరిచాలన్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.

మూడు షాహీ స్నానాల సమయంలో ఒక్కరోజులో కనీసం 20 లక్షల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేశారు. గంగా స్నానం చేసి తమ ప్రాంతాలకు తిరిగి వెళుతున్న అనేక మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. కుంభమేళాలో పాల్గొని తిరిగి వస్తున్న యాత్రికులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్టీ–పీసీఆర్‌ పరీక్షను తప్పనిసరి చేసింది.

ఉత్తరాఖండ్‌ కోవిడ్‌ స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌ 10- 14 మధ్య హరిద్వార్‌లో పరీక్షలు చేయించుకున్న వారిలో 1700 మందికి పైగా కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. మహా కుంభమేళాలో పాల్గొన్న అనేకమంది సాధువులకు కూడా కరోనా సోకింది. నిర్వాణి అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్‌ కపిల్‌దేవ్‌ కరోనా వైరస్ తో మరణించారు. కుంభమేళాలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్‌ నుంచి ఆయన హరిద్వార్‌కు వెళ్ళారు.

అయితే అక్కడ కుంభ్‌మేళాలో పాల్గొన్న అనంతరం జరిపిన పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనకు డెహ్రాడూన్ లోని కైలాష్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందించారు. కరోనాతో పోరాడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కుంభ్‌మేళా సమయంలో కరోనా వైరస్‌ సంక్రమణతో మరణించిన మొదటి ప్రధాన సాధువు కపిల్‌ దేవ్‌.