Rains In Telangana : రాబోయే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు
రానున్న మూడు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
Rains in Telangana : రానున్న మూడు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పిడుగులు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర కర్నాటక, పశ్చిమ మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల నుంచి విస్తరించిన ఉపరితల ద్రోణీతో వర్షాలు పడుతాయని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంది.
ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల, వికారాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలకు ఆస్కారం ఉంది. ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు పడొచ్చని సూచించింది.
మే 12న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ రోజు కొన్ని పిడుగులు పడే అవకాశం ఉంది. మెరుపులతో బలమైన గాలులు వీస్తాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ఆస్కారం ఉంది.
రాష్ట్రంలో అక్కడక్కడా వర్షపాతం నమోదు అయింది. ఆదిలాబాద్ జిల్లా తామ్ సీలో 2 సెం.మీ వర్షపాతం కురిసింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.
ఓ వైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతుంటే మరోవైపు మరికొన్ని జిల్లాల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంది. నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 40 డిగ్రీలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.