Revanth Reddy: సరూర్నగర్ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారు.. లక్ష్మణ్, కిషన్ వస్తే హనుమాన్ చాలీసా చదువుకుందాం
బీజేపీని గెలిపించేందుకే కర్ణాటకలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నిజంగా బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే కర్ణాటకలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి బీజేపీని ఓడించాలని ప్రకటించాలంటూ కేసీఆర్ను ఆయన డిమాండ్ చేశారు.
Revanth Reddy: సరూర్ నగర్ గ్రౌండ్లో ఈనెల 8న సాయంత్రం 3గంటలకు యువ సంఘర్షణ సభ జరుగుతుందని, ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ పాల్గొని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు.. వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసింది. చివరకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు సంతలో సరుకులా మార్చేశారు. వందల కోట్లకు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
Revanth Reddy : ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మమేమిటి? : రేవంత్ రెడ్డి
రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మోడల్కు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం వదిలేసి శరద్ మడ్కర్ అనే వ్యక్తి బీఆర్ఎస్లో చేరారని పత్రికల్లో ప్రచారం చేసుకున్నారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్లో చేరిన అతనికి మే 2న సీఎం ప్రైవేటు సెక్రెటరీగా నియమించారు. ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్ళను తెచ్చి పెట్టుకుంటున్నారని, పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారు. ఎవరి సొమ్మని ఏడాదికి 18లక్షలు అతనికి జీతం ఇస్తున్నారంటూ రేవంత్ ప్రశ్నించారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని 20లక్షల విద్యార్థులకు, 30లక్షల నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా.. 8న జరిగే యువ సంఘర్షణ సభకు తరలిరండి. రైతు డిక్లరేషన్లా సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారు. కేసీఆర్పై కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి విద్యార్థి, నిరుద్యోగులు మద్దతుగా తరలిరండి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీని గెలిపించేందుకే కర్ణాటకలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ విమర్శించారు. నిజంగా బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే.. కర్ణాటకలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి బీజేపీని ఓడించాలని ప్రకటించాలంటూ కేసీఆర్ ను రేవంత్ డిమాండ్ చేశారు. లక్ష్మణ్, కిషన్రెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర హనుమాన్ చాలీసా చదువుకుందామని రేవంత్ ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సింది కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు అని అన్నారు. కర్ణాటకలో 40శాతం కమీషన్ల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి నినాదాలు ఇస్తోందని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ సచివాలయాన్ని ప్రయివేట్ ఎస్టేట్ అనుకుంటున్నాడని, త్వరలోనే ఆయన భ్రమలు తొలగిపోతాయని, బంగళాలు మారినంత మాత్రాన కేసీఆర్ వంకరబుద్ది మారదంటూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.