రూ.6 కోట్ల కోవిడ్ నిధుల దారి మళ్లింపు..అధికారి సస్పెండ్

  • Published By: bheemraj ,Published On : July 18, 2020 / 08:07 PM IST
రూ.6 కోట్ల కోవిడ్ నిధుల దారి మళ్లింపు..అధికారి సస్పెండ్

తెలంగాణలో కోవిడ్ నిధుల దారి మళ్లింపు ఓ అధికారి సస్పెన్షన్ కు దారి తీసింది. మహిళా సంఘాలతో మాస్కులు, శానిటైజర్లు తయారు చేయించేందుకుగానూ ప్రభుత్వం కోవిడ్ నిధులు మంజూరు చేసింది. అయితే అందులోనుంచి రూ.6 కోట్ల రూపాయలను సెర్ఫ్ అధికారులు ఇతర అవసరాలకు వాడేశారు. విషయం బయటకు పొక్కడంతో శాఖాపరమైన విచారణ జరిపించారు. నిధుల దారి మళ్లింపు నిజమని తేలడంతో సెర్ఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్లయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

కోవిడ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. కోవిడ్ సందర్భంగా పలు రంగాలకు ఉపాధి కూడా కోల్పోయారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలను ఆదుకోవాలనే లక్ష్యంగా, వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో మాస్కులు, శానిటైజర్లను తయారు చేయించేందుకు నిధులను మంజూరు చేసింది.

అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలో పని చేసే ఓ అధికారి కోవిడ్ నిధులను దారి మళ్లించారు. మాస్కులు, శానిటైజర్లు కాకుండా శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేందుకు ఈ నిధులను వినియోగించుకున్నట్లు అధికారుల శాఖాపరమైన విచారణలో తేలింది. దీంతో ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ కొద్ది సేపటి క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోవిడ్ నిధుల దారి మళ్లింపుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రభుత్వ పరంగా కోవిడ్ ను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిధులు దారి మళ్లాయన్న అభిప్రాయం ప్రభుత్వం వ్యక్తం చేసింది.