RTC Bus: అకస్మాత్తుగా ఆగిన ఆర్టీసీ బస్సులు.. ఇబ్బంది పడ్డ ప్రయాణికులు
బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ప్రయాణికులకు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
RTC Bus: బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ప్రయాణికులకు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఉదయం నాలుగున్నర గంటలకు బయల్దేరిన గరుడ ప్లస్ బస్సు ఇంజన్లో సాంకేతిక సమస్యలు దెబ్బకు రద్దయ్యింది. కానీ, సమాచారం మాత్రం ప్రయాణికులకు ఇవ్వలేదు.
దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని సమాచారం ఇవ్వకుండా ఎక్కువగా రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రయాణికుల నుంచి కంప్లైంట్లు ఎక్కువయ్యాయి. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆకస్మికంగా రద్దవుతున్న బస్సుల వల్ల అప్పటికప్పుడు మరో బస్సులో వెళ్లేందుకు అవకాశం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు తప్పనిసరిగా వెళ్లాల్సిన వాళ్లు మాత్రం ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి ప్రయాణాలు చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ఆ సమాచారాన్ని ప్రయాణికులకు ఇవ్వట్లేదని వారు వాపోతున్నారు.
ప్రయాణికులకు సమాచారం అందజేయడంలో తమ సిబ్బంది విఫలమైనట్లు పై అధికారులే ఒప్పుకుంటున్నారు. కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, లక్డీకాపుల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూసి చేసేదేం లేక ఇంటికి వెనుదిరిగారు. అయితే ఆర్టీసీ అధికారులు సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దవుతున్నట్లు పైకి చెబుతున్నప్పటికీ ఏసీ బస్సులకు ఆదరణ లేకపోవడం వల్లనే రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా ఏసీ బస్సులు ఎక్కాలంటే ప్రయాణికులు ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు.