Tarnaka RTC Hospital : కరోనా కాటుకు బలవుతున్న ఆర్టీసీ ఉద్యోగులు.. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చండి..
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. వారికి వైద్యం అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రి ఉన్నా .. అందులో కరోనా సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
Tarnaka RTC Hospital complete Covid Hospital : తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. వారికి వైద్యం అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రి ఉన్నా .. అందులో కరోనా సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని పూర్తి కోవిడ్ హాస్పిటల్గా మార్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది.
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్లో పనిచేసే ఉద్యోగులు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ప్రయాణికులు ఎక్కువ ఆర్టీసీ మీదే ఆధారపడి ప్రయాణాలు కొనసాగిస్తారు. కరోనా రోగులు సైతం బస్సుల్లోనే ఆస్పత్రికి వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు కరోనా కాటుకు బలవుతున్నారు. ఇప్పటివరకు అనధికార లెక్కల ప్రకారం 250 మంది వైరస్తో మృతిచెందారు.
టీఎస్ ఆర్టీసీలో 49 వేలకు పైగా ఉద్యోగులున్నారు. రాష్ట్రంలోని వివిధ డిపోల్లో పని చేసే సిబ్బందికి, పదవీవిరమణ చేసిన వారికి వైద్య సేవలు అందించేందుకు జిల్లాలోనూ డిస్పెన్సరీ లను టి.యస్ ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసింది. కరోనా మొదటి వేవ్ లోను చాలా మంది ఆర్టీసీ కార్మికులు కరోనాతో చనిపోయారు.. సెకండ్ వేవ్ కరోనాతో రెట్టింపు సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు ఆర్టీసీ సిబ్బంది.
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని కోవిడ్ హాస్పిటల్గా మార్చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తార్నాక ఆస్పత్రిలో సుమారు రోజుకు 12 వేల వేల మందికిపైగా వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. ఆర్టీసీ ఆస్పత్రిలో 200లకు పైగా బెడ్స్ ఉన్నాయి. అయితే ఐసీయూలో ఆక్సిజన్ బెడ్స్ లేకపోవడంతో కోవిడ్ ఆస్పత్రికిగా ప్రభుత్వం అనుమతించలేదు.
ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసి ఆర్టీసీ ఆస్పత్రిని కోవిడ్ సెంటర్గా మార్చాలని సూపరింటెండెంట్ వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. దీంతో తార్నాక ఆస్పత్రిని ఉన్నతాధికారులు పరిశీలించారు. త్వరలోనే కోవిడ్ సెంటరు ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు కరోనాతో ఆర్టీసీ ఉద్యోగులు మృత్యువాత పడుతున్నారని.. వీలైనంత త్వరగా తార్నాక ఆస్పత్రికి కోవిడ్ సెంటర్గా మార్చాలని ఆర్టీసీ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.