గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు
ఎట్టకేలకు గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారించింది. గత కొన్నిరోజులుగా నర్సులు, ఔట్ సోర్సింగ్, శానిటరీ, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. అయితే ప్రధానంగా ఉద్యోగులు శ్రమకు తగ్గ వేతనంతోపాటు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
నర్సులకు వేతనాన్ని రూ. 17,500ల నుంచి రూ. 25 వేలకు పెంచారు. కరోనా విధుల్లో ఉన్నవారికి డైలీ ఇన్సెంటివ్ కింద రూ. 750 ఇవ్వాలని నిర్ణయించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ సిబ్బందిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాలుగో తరగతి సిబ్బందికి రోజుకు రూ. 300 ఇన్సెంటివ్, 15 రోజులు డ్యూటీ చేసేలా వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
అయితే తమ ఆందోళనపై ప్రభుత్వం జీతాలు పెంచేందుకు ఒప్పుకోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఇక తమను ఔట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టుకు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులందరూ ప్రభుత్వానికి సహకరించి.. తక్షణమే విధుల్లో చేరాలని మెడికల్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ హామీలతో సమ్మెను విరమిస్తున్నట్లు నర్సులు ప్రకటించారు. తక్షణమే విధుల్లో చేరుతామని చెప్పారు.