Telangana Vaccination : తెలంగాణలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్

తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి విధివిధానాలు సైతం రూపొందించాలని మంత్రి హరీష్ రావు, అధికారులను కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

Telangana Vaccination : తెలంగాణలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్

Telangana Vaccination

Telangana Vaccination : తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి విధివిధానాలు సైతం రూపొందించాలని మంత్రి హరీష్ రావు, అధికారులను కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

”రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ను మంగళవారం నుంచి ప్రారంభించాలి. ఇప్పటికే మొదటి డోసు పూర్తి చేసుకుని.. రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారు సమీపంలోని ప్రభుత్వ వాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చు. వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్‌ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులు రూపొందించాలి” అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

వ్యాక్సినేషన్‌ విషయంలోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని, ఇందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ నుంచే 18-45 ఏళ్ల మధ్య వారికి కూడా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా.. టీకాల కొరతతో చాలా రాష్ట్రాల్లో ఈ వయసు వారికి టీకాల పంపిణీ జరగడం లేదు. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా వస్తున్న టీకాల స్టాకుతో వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇలా మాటిమాటికి టీకాల పంపిణీ ఆపడం సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త విధానాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టింది. కొద్దిరోజుల పాటు పంపిణీ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. ప్రస్తుతం స్టాకు ఉన్న మేరకు క్రమపద్ధతిలో టీకాలు ఇస్తూ.. నిరంతరాయంగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందిస్తోంది.

ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి రెండో డోసు టీకాలు వేస్తున్నారు. దీనితోపాటు 45 ఏళ్లు నిండిన వారందరికీ తొలి డోసు మొదలుపెట్టాలని.. 30 ఏళ్లు నిండిన వారిని కేటగిరీలుగా గుర్తించి టీకాలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో తప్పనిసరిగా బయటికి రావాల్సి ఉన్న రంగాల వారికి తొలుత వ్యాక్సిన్‌ ఇస్తారు. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు, రవాణా, గ్యాస్‌ పంపిణీ, పెట్రోల్‌ బంకుల సిబ్బంది.. వివిధ కేటగిరీలుగా విభజించి ప్రాధాన్యతా క్రమంలో టీకాలు వేస్తారు. ఇదేగాకుండా వ్యాక్సినేషన్‌కు సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. రెగ్యులర్‌గా నిర్వహించే కేంద్రాలతోపాటు మొబైల్‌ కేంద్రాలనూ సిద్ధం చేయనుంది. ఈ మొత్తం ప్రణాళిక సిద్ధంకాగానే.. సీఎం ఆమోదంతో అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేసిన ప్రభుత్వం.. తర్వాత 60ఏళ్లు నిండిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ మొదలుపెట్టింది. ఈ నెల 1 నుంచే 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినా.. కొరత కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 55లక్షల 26వేల 985 డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు వేసుకున్న వారు 44లక్షల 53వేల 573 మంది ఉండగా… రెండు డోసులూ పూర్తయిన వారు 10లక్షల 73వేల 412 మంది ఉన్నారు.

రాష్ట్రానికి సోమవారం 2.54 లక్షల డోసుల కోవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. వీటితో కలిపి సుమారు 4లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక కోవాగ్జిన్‌ డోసులు 53 వేలు నిల్వ ఉండగా.. మంగళవారం మరో 50 వేల డోసులు రానున్నాయని వివరించారు. కాగా.. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మందికి కోవాగ్జిన్‌ రెండో డోసు ఇవ్వాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.