షాపూర్జీ పల్లోంజి సంస్థకు తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు, ఏడాదిలోనే పూర్తి చెయ్యాలి

  • Published By: naveen ,Published On : October 30, 2020 / 02:51 PM IST
షాపూర్జీ పల్లోంజి సంస్థకు తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు, ఏడాదిలోనే పూర్తి చెయ్యాలి

Shapoorji Pallonji Company : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులకు సంబంధించిన టెండర్ ఫైనల్ అయిపోయింది. షాపూర్జీ పల్లోంజి సంస్థ.. ఈ కీలక టెండర్‌ను సొంతం చేసుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ మేరకు.. ఆర్ అండ్ బీ శాఖకు, షాపూర్జీ పల్లోంజి సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది.

రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలు ప్రతిబింబిచేలా అద్భుతరీతిలో కొత్త సచివాలయ నిర్మాణం:
తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలు ప్రతిబింబిచేలా.. అద్భుతరీతిలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి.. టెండర్లు ఆహ్వానించింది. సచివాలయ నిర్మాణం టెండర్ దక్కించుకునేందుక.. షాపూర్జీ పల్లోంజితో పాటు ఎల్ అండ్ టీ సంస్థ తుదివరకు పోటీ పడ్డాయి. కానీ.. చివరకు ప్రభుత్వ అంచనా వ్యయం కంటే.. 4 శాతం ఎక్కువ కోట్ చేసి.. 494 కోట్లకు షాపూర్జీ పల్లోంజి సంస్థ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది.

రెండెకరాల్లో 7 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం:
అగ్రిమెంట్ కుదుర్చుకున్న రోజు నుంచి.. 12 నెలల్లోపే సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం షాపూర్జీ పల్లోంజి సంస్థకు షరతు విధించింది. ఏ స‌మ‌యానికి ఎంత నిర్మాణం పూర్తి కావాల‌న్న దానిపై ప్రభుత్వం.. టెండ‌ర్ అగ్రిమెంట్‌లో స్పష్టం చేయ‌నుంది.‌ టెండర్ కాంట్రాక్ట్ ప్రకారం రెండెకరాల ప్రాంతంలో.. 7 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ భవనం నిర్మించనున్నట్లు సమాచారం. మిగిలిన ప్రాంతంలో.. ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్, ఇతర సదుపాయాలుంటాయి. భవనంలోని మధ్య పోర్షన్‌లో అశోకుడి ధర్మచక్ర స్తూపం ఉంటుంది. అది 15 అంతస్థుల ఎత్తు ఉంటుంది. సీఎం ఆఫీసు ఆరో అంతస్థులో ఉంటుంది.

ఫేమస్ ఆర్కిటెక్ట్‌లతో చర్చించి ఫైనల్‌గా డిజైన్ ఖరారు:
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త సచివాలయం నిర్మించదల్చుకుంది. ఇందుకోసం.. సెక్రటేరియట్‌కు సంబంధించిన డిజైన్‌పై సీఎం కేసీఆర్ చాలా రోజులు కసరత్తు చేశారు. ఫేమస్ ఆర్కిటెక్ట్‌లతో చర్చించి.. ఫైనల్‌గా ఈ డిజైన్ ఖరారు చేశారు. మొత్తం ఏడు అంతస్థుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు. పాత సచివాలయం భవనాలు శిథిలావస్థలో ఉన్నందున.. తెలంగాణ ప్రభుత్వం దాని కూల్చేసింది. అదే ప్రాంతంలో.. ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మిస్తున్నారు.