మొబైల్‌ సిమ్‌లను బ్లాక్‌ చేసి.. నగదు కాజేస్తున్న ముఠా అరెస్టు

మొబైల్‌ సిమ్‌లను బ్లాక్‌ చేసి.. నగదు కాజేస్తున్న ముఠా అరెస్టు

SIM swap scams .. Interstate gang arrested : సిమ్‌ స్వాప్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్న ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిమ్ స్వాప్‌ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామన్నారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌.

2011 నుంచి సిమ్‌ స్వాప్‌ దందా చేస్తూ కోట్లు కాజేశారని వెల్లడించారు. వివిధ సంస్థల ఆర్థిక లావాదేవీలు చేస్తున్న ఫోన్‌ నంబర్లను టార్గెట్‌ చేస్తున్నారని, ఆ మొబైల్‌ సిమ్‌లను బ్లాక్‌ చేసి.. నగదు కాజేస్తున్నారని చెప్పారు. నగరానికి చెందిన ఇద్దరిని మోసం చేసి 11 లక్షలు రూపాయలు కాజేశారని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ ముఠాకు చాలా అకౌంట్లు ఉన్నాయని.. కాజేసిన డబ్బులను బిట్‌కాయిన్‌, హవాలా ద్వారా నైజీరియాకు పంపిస్తున్నారని వెల్లడించారు. నిందితుల నుంచి 40 నకిలీ ఆధార్‌ కార్డులు, 4 రబ్బరు స్టాంపులు, 15 మొబైల్‌ ఫోన్లు, నకిలీ లెటర్‌ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.