వీడు మామూలోడు కాదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న కిడ్నాపర్
deekshith kidnap case: మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. 37 గంటలుగా కిడ్నాపర్ చెరలోనే ఉన్నాడు దీక్షిత్. ఇప్పటివరకు బాలుడి ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీక్షిత్ కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు ఎస్పీ కోటిరెడ్డి. మొత్తం 100మంది పోలీసు సిబ్బంది టీమ్ వర్క్ చేస్తోంది. బాలుడి కోసం ఇద్దరు డీఎస్పీలు, 8మంది సీఐలు, 15 మంది ఎస్ఐల నేతృత్వంలో గాలింపు కొనసాగుతోంది.
ఫోన్ కాల్స్ బంద్, బాబాయ్ పైనే అనుమానాలు:
అయితే దీక్షిత్ బాబాయ్ మనోజ్పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న(అక్టోబర్ 19,2020) ఉదయం దీక్షిత్ తల్లికి కాల్ చేసిన కిడ్నాపర్ 45లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి కాల్స్ చేయలేదు. అయితే మనోజ్పై అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్స్ కాల్స్ రాకపోవడంతో మనోజే అసలు సూత్రధారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లోకేషన్ దొరక్కుండా ఇంటర్నెట్ ద్వారా ఫోన్ కాల్స్:
కిడ్నాపర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తను ఉన్న లోకేషన్ ఎవరికీ దొరక్కుండా ఇంటర్నెట్ ద్వారా ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు గుర్తించారు. దీంచో ఆచూకీ తెలుసుకోవడం కాస్త ఇబ్బందిగా మారింది. మరోవైపు హైదరాబాద్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ మహబూబాబాద్కు వెళ్లింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పలు ఆధారాలు సేకరించింది. దాదాపు 200 సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. రెండు రోజుల క్రితం దీక్షిత్ను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్.. నిన్న ఉదయం బాలుడి తల్లికి కాల్ చేసి 45లక్షలు డిమాండ్ చేశాడు. అయితే మధ్యాహ్నం నుంచి ఎలాంటి కాల్స్ కిడ్నాపర్ చేయలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గంటలు గడిచినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
దగ్గరి బంధువుల పనేనా?
దీక్షిత్ ఆచూకీ కోసం పోలీసులు సెర్చింగ్ వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దగ్గరి బంధువులే దీక్షిత్ను కిడ్నాప్ చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. దీక్షిత్ తండ్రి రంజిత్ ఓ న్యూస్ చానల్ లో వీడియో జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు.