మైనర్ బాలికపై అత్యాచారం….హత్యా యత్నం…. ఖమ్మంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

  • Published By: murthy ,Published On : October 6, 2020 / 12:24 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం….హత్యా యత్నం…. ఖమ్మంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

Telangana: ఖమ్మంజిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి….. ప్రతిఘటించిందని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కట్టు కధలు అల్లి ఆస్పత్రిలో చేర్పించాడు ఆ కామాంధుడు. కామాంధుడు కర్కశత్వానికి బలైన బాలిక ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. బేల చూపులు చూస్తూ మంచానికే పరిమితమయ్యింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టటానికి ఎన్ని చట్టాలువచ్చినా, పోలీసులు ఎన్ కౌంటర్లు చేస్తున్నా, కీచకుల ఆలోచనల్లో మాత్రం మార్పురావటంలేదు.




ఖమ్మం రూరల్ మండలం పల్లె గూడెంకు చెందిన వ్యక్తి జాతకాలు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఇటీవల కాలంలో సరైన ఆదాయం లేక తన 13 ఏళ్ళ మైనర్ కుమార్తెను ముస్తఫానగర్, పార్శి బంధంలో ఆయుర్వేద వైద్యం చేసే అల్లం సుబ్బారావు అనే వ్యక్తి ఇంటిలో పనిమనిషిగా… మే నెలలో కుదిర్చాడు. సుబ్బారావు కుమారుడు మారయ్య బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఎప్పుడు జరిగింది ?
అల్లంసుబ్బారావు ఇంట్లో పనికి కుదిరిన మైనర్ బాలికపై సుబ్బారావు కుమారుడు మారయ్య కన్నేశాడు. మారయ్యకు పెళ్లైంది. అయినా మైనర్ బాలికపై కోరికతో రగిలిపోయాడు. అవకాశం ఎదురు చూస్తున్నాడు. సెప్టెంబర్ 18వ తేదీన మారయ్య భార్య, తల్లి పనిమీద వేరే ఊరు వెళ్ళటంతో ఇంట్లో తండ్రి సుబ్బారావు, మారయ్య ఇద్దరే ఉన్నారు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్నబాలిక వద్దకు మారయ్య వచ్చి తన గదికి రమ్మని వేధించాడు. ఆమె రాననే సరికి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. దీంతో బాలిక మారయ్యను ప్రతిఘటిస్తూ ..గట్టిగా ఏడ్చింది.




బాలికను ఊరికే వదిలేస్తే విషయం బయట పడుతుందనుకున్న మారయ్య బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల ధాటికి బాలిక బిగ్గరగా ఏడుస్తూ కేకలు వేసింది. బాలిక ఏడవటం విని, పైన నిద్రిస్తున్న తండ్రి సుబ్బారావు కిందకు దిగి వచ్చి మంటలను ఆర్పివేశాడు. చుట్టు పక్కలవారు వచ్చి ఏమైందని అడిగితే పూజ గదిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మంట అంటుకుని గాయాలు అయ్యాయని చెప్పి అందరినీ వెళ్లగొట్టాడు.

ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం
అనంతరం ఖమ్మంలోని పూజ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించటం ప్రారంభించాడు. ఆస్పత్రిలో చేర్పించిన మూడు రోజుల తర్వాత ఆమె తల్లి తండ్రులకు సమాచారమిచ్చాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమించటంతో లక్షా 50 వేల రూపాయలు ఇస్తానని..విషయం బయటకు చెప్పొద్దని తల్లి తండ్రులతో బేరం పెట్టాడు. వారు వినక పోవటంతో ఇన్నాళ్లు బెదిరిస్తూ వచ్చాడు.




వారు లొంగకపోవటం.. బాలిక ఆరోగ్యం విషమించటంతో ఇక చికిత్స చేయించనని చెప్పి పక్కకు తప్పుకునన్నాడు. దీంతో బాధితురాలి తల్లితండ్రులు ఆదివారం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుస్టేషన్ లో కేసు నమోదవటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కాలిన గాయాలతో మైనర్ బాలిక ఆస్పత్రిలో చేరినా పూజ ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఇప్పటి వరకు సమాచారం ఇవ్వకపోవటంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

పోలీసు కమీషనర్ పరామర్శ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పోలీసు కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సోమవారం పరామర్శించారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాలతి బాలికను పరామర్శించారు.




మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ రికార్డు చేశారు. పోలీసులు నిందితుడు మారయ్యను అదుపులోకి తీసుకున్నారు. సుమోటో కేసుగా స్వీకరించాలని అడిషనల్‌ డీసీపీ పూజను సీపీ తఫ్సీర్‌ ఆదేశించారు. పోక్సో యాక్ట్, అత్యాచార, హత్యాయత్నం, నిర్భయ కేసు నమోదు చేశారు. జిల్లాకు వచ్చిన ఐజీ నాగిరెడ్డి సైతం బాలిక ఘటనపై సీపీని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.