Telangana BJP : కేటీఆర్ ను ఎందుకు కలిశారో..తేల్చండి…త్రిసభ్య కమిటీ వేసిన బీజేపీ
లింగోజిగూడ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలంటూ..మంత్రి కేటీఆర్ ను కలిసిన గ్రేటర్ బీజేపీ నేతలపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉంది.
BJP Leaders Met KTR : లింగోజిగూడ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలంటూ..మంత్రి కేటీఆర్ ను కలిసిన గ్రేటర్ బీజేపీ నేతలపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉంది. భేటీ జరిగిన సమయంలో ఏమి జరిగిందో తేల్చాలంటూ..తెలంగాణ బీజేపీ త్రిసభ్య కమిటీ వేసింది. ఈ కమిటీలో జాతీయ ఏస్సీ మోర్చా కార్యదర్శి ఎస్. కుమార్, యెండల లక్ష్మీనారాయణ, మల్లారెడ్డిలున్నారు.
కేవలం రెండు రోజుల్లో రిపోర్టు సమర్పించాలని నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేటీఆర్ తో కలిసిన సందర్భంగా..ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో కమిటీ నిగ్గు తేల్చనుంది. టీఆర్ఎస్ పై పోరాడుతూనే…కార్పొరేట్ ను ఏకగ్రీవం చేయడానికి మంత్రి కేటీఆర్ ను కలుస్తారా ? అంటూ అధినాయకత్వం గుస్సాగా ఉంది. సమావేశం సందర్భంలో..బండి సంజయ్ పై కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు వారించకుండా..బీజేపీ నేతలు మిన్నకుండి పోయారని భావిస్తున్న నాయకత్వం ఈ భేటీని తీవ్రంగా పరిగణిస్తోంది. నివేదికను రాష్ట్ర నాయకత్వానికి సమర్పించిన తర్వాత..బీజేపీ నేతలపై చర్యలు తీసుకోనే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ క్యాడిండెట్ ఆకుల రమేష్ గౌడ్ గెలిచారు. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ నేత ఎం.శ్రీనివాసరావుపై ఆయన విజయం సాధించారు. ఆయన ఇటీవలే చనిపోయారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో…ఇక్కడ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత రామ్ చందర్ రావు, ఆకుల రమేశ్ కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్ ను కలవడం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తిగా రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఏకగ్రీవానికి ఎలా మద్దతు కోరుతారని తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి భేటీలతో తప్పుడు సంకేతాలు వెళుతాయని నాయకత్వం భావిస్తోంది. మరి నివేదిక వచ్చిన తర్వాత..ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.